రేవంత్ టీముకు మంచి మార్కులు పడ్డాయా ?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాలు జరిగిన విధానం చూస్తే ఒకవైపు వాడివేడిగాను మరోవైపు హుందాగాను జరిగినట్లే అనుకోవాలి. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు అనగానే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. గతంలో కేసీయార్ హయాంలో కూడా ఇలాగే జరిగింది. కేసీయార్ పాలనలో పదేళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు ప్రతిపక్ష ఎంఎల్ఏలను బయటకు పంపేయటం లేదంటే సస్పెండ్ చేయటంతోనే సరిపోయింది.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల అరుపులు, కేకలతో ఒక్కరోజు కూడా సమావేశం జరిగిందిలేదు. కానీ ఇపుడు రేవంత్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు లేవని గుర్తించాలి. ఎందుకంటే అంశాల వారీగా జరిగిన చర్చల్లో రేవంత్, మంత్రులు, అధికార పార్టీ ఎంఎల్ఏలతో పాటు ప్రతిపక్షాలకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు కాబట్టే. బీఆర్ఎస్ తరపున కేటీయార్, హరీష్ రావు, జగదీశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, ఎంఐఎం తరపున అక్బరుద్దీన్, సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వరరెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు మాట్లాడారు.

గతంలో కూడా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చినా వెంటనే కేసీయార్ లేదా మంత్రుల జోక్యంతో ప్రతిపక్ష సభ్యులకు మైక్ కట్టయిపోయేది. పైగా కాంగ్రెస్ సభ్యులపై కేసీయార్, కేటీయార్, హరీష్ లాంటి వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడేవారు. అయితే ఇపుడు అలాంటి వాతావరణం కనబడలేదు. ప్రతిపక్షాల తరపున కేటీయార్, హరీష్, అక్బరుద్దీన్, ఏలేటి తదితరులు తాము చెప్పదలచుకున్న విషయాలను పూర్తిగా మాట్లాడారు.

నిజానికి అసెంబ్లీలో చర్చలు పార్టీల సభ్యుల ప్రాతినిధ్యం ఆధారంగానే నిర్ణయమవుతుంది. అయితే ఆ విషయాన్ని రేవంత్ పట్టించుకోకుండా బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులకు మాట్లాడే అవకాశం బాగానే ఇచ్చారనే చెప్పుకోవాలి. అందుకనే పదేపదే కేటీయార్, హరీష్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. సో, మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును గమనిస్తే రేవంత్ టీముకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.