ప‌వ‌న్‌తో డైరెక్టుగా మాట్లాడొచ్చుగా జోగ‌య్య గారు…!

కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. కాపుల అభ్యున్న‌తి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్న మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య‌.. తాజాగా సంధించిన లేఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ముఖ్య‌మంత్రి సీటు విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే, త‌న‌కు ప‌దవుల‌పై కాంక్ష లేద‌ని.. జ‌న‌సేనాని ప‌దే ప‌దే చెబుతున్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను కార్న‌ర్ చేస్తూ.. తాజాగా జోగ‌య్య ప‌వ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. కాపుల‌కు ఏం స‌మాధానం చెబుతార‌ని, మీపైనే ఆశ‌లు పెట్టుకుని, క‌ల‌లు క‌న్న వారికి ఎలాంటి స‌మాధానం చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది ఒక ర‌కంగా.. జ‌న‌సేనాని గాలి తీసేసే ప్ర‌య‌త్న‌మేన‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల టాక్‌. ఆయ‌న‌కు ఏదైనా చెప్పాల‌ని ఉంటే.. నేరుగా ప‌వ‌న్‌తోనే చ‌ర్చించి ఇది త‌ప్పు.. లేదా ఇది ఒప్పు అని చెప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అలా కాకుండా.. బ‌హిరంగ వేదిక‌ల‌పై జ‌న‌సేన ను ఇర‌కాటంలో పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. కాపుల‌ప‌క్షాన ఉంటున్నామ‌ని, కాపుల కోసం నిల‌బ‌డుతున్నా మ‌ని చెప్పే జోగ‌య్య‌.. ప‌వ‌న్‌ను ఇలా యాగీ చేయ‌డం.. ఆయ‌నను కార్న‌ర్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే.. సరైన వేదిక ద్వారా అభిప్రాయం వెల్ల‌డించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక‌, ప‌వ‌న్ వ్య‌వ‌హారం చూసినా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉన్నార‌ని చెబుతున్నారు.

కాపుల‌కు మేలు చేయాలంటే.. కేవ‌లం ముఖ్య‌మంత్రి పీఠమే ప‌ర‌మావ‌ధి కాద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నా.. జోగ‌య్య వంటివారికి అర్ధం కావ‌డం లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదైనా చెప్పాల‌ని ఉంటే.. నేరుగా ప‌వ‌న్‌ను క‌లిసి.. ఆయ‌న‌తోనే అభిప్రాయం పంచుకుంటే బాగుంటుంద‌ని అంటున్నారు. ఇలా బ‌హిరంగ లేఖ‌ల ద్వారా వ్యాఖ్య‌లు చేసి.. అన‌వ‌స‌రంగా పార్టీని ఇరుకున పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.