అప్పులు తేకుండా అభివృద్ధి సాధ్యం కాదు – బీఎర్ఎస్ మాట

బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో అప్పు బయటపడుతోంది. వివిధ శాఖల పనితీరుతో పాటు ఆర్ధిక వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా సమీక్షలు చేస్తోంది. ఈ సమీక్షల నేపధ్యంలోనే తెలంగాణా ఆర్ధికపరిస్ధితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణా అప్పులు రు. 7 లక్షల కోట్లుగా బయటపడింది. అయితే తమ హయాంలో జరిగిన అప్పులను బీఆర్ఎస్ ఎంఎల్ఏలు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు సమర్ధించుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికి బయటపడిన అప్పుల వివరాల ప్రకారం విద్యుత్ శాఖ రుణభారం రు. 81,516 కోట్లని తేలింది. అలాగే జెన్కో, ట్రాన్స్ కో నష్టాలు రు. 62,461 కోట్లు. వివిధ ప్రభుత్వ శాఖల బకాయిలు రు. 28,842 కోట్లు. పెండింగులో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ బిల్లులు రు. 14,193 కోట్లు. ట్రూఅప్ ఛార్జీల బకాయిలు రు. 14,928 కోట్లున్నాయి. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ సరఫరా 19 గంటలే అని బయటపడింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో కూడా కేసీయార్, కేటీయార్, హరీష్ తదితరులు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు కొన్ని వేలసార్లు చెప్పుంటారు. అదంతా అబద్ధాలే అని ఇపుడు తేలింది.

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఎంఎల్ఏ జగదీశ్వరరెడ్డి విచిత్రమైన వాదన వినిపించారు. అప్పులు తేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని వాదించారు. ఎంత అప్పులు తెచ్చినా లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయటం ఏమిటన్నది ఎవరికీ అర్ధంకావటం లేదు. పైగా రాష్ట్ర విభజన తర్వాత దేశం మొత్తం మీద తెలంగాణానే రిచ్చెస్ట్ స్టేట్ అంటు కేసీయార్ పదేపదే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

అంత రిచ్చెస్ట్ స్టేట్ అయ్యుండి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టే అప్పుల వివరాలు బయటకొచ్చాయి. లేకపోతే అప్పుల వాస్తవ వివరాలు బయటపడాలంటే మరో ఐదేళ్ళు వెయిట్ చేయక తప్పేది కాదు. అందుకనే విద్యుత్ రంగంలో జరిగిన వేలాది కోట్ల రూపాయల అప్పులు, నష్టాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించబోతున్నట్లు రేవంత్ ప్రకటించింది. విచారణలు చేయిస్తే మిగిలిన శాఖల అప్పులకు కూడా కారణాలు బయటపడతాయేమో.