దెబ్బకు నిర్మాణ సంస్ధ దిగొచ్చిందా ?

కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకు నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ దిగొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పనులను సంస్ధ మొదలుపెట్టింది. చడీ చప్పుడు లేకుండానే సంస్ధ ఇంజనీరింగ్ బృందం మరమ్మత్తు పనులు మొదలుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించి ఏడో బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. పిల్లర్లు కుంగిపోవటంలో బ్యారేజి మీద కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి.

సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఇది జరగటంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా నష్టం జరిగిందనే చెప్పాలి. దాంతో మరమ్మత్తు పనుల వ్యయాన్ని ఎల్ అండ్ టీ సంస్ధే భరిస్తుందని కేటీయార్ అప్పట్లో ప్రకటించారు. దానికి ఆమోదం తెలుపుతూ సంస్ధ యాజమాన్యం కూడా ప్రకటించింది. మరమ్మత్తుల ఖర్చులన్నీ తమ సంస్ధే భరిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చంది. దాంతో నాలుగు రోజుల క్రితం సంస్థ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే మరమ్మత్తులకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించాలని, తమకు ఎలాంటి సంబంధంలేదని.

సంస్ధ మేనేజ్మెంట్ ను రివ్యూకి పిలిచిన రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వాయించేశారు. ఎన్నికల సమయంలో మరమ్మత్తుల విషయంలో చేసిన ప్రకటనను గుర్తుచేశారు. దాంతో పాటు ఇంకే విషయాలను మాట్లాడారో ఏమి వార్నింగ్ ఇచ్చారో తెలీదు. దాంతో ఎల్ అండ్ టీ దిగొచ్చింది. ఎలాంటి ప్రకటనలు, ఆర్భాటాలు లేకుండానే మరమ్మత్తు పనులు మొదలుపెట్టింది.

మరమ్మత్తులు చేయాల్సిన ప్రాంతమంతా మహారాష్ట్ర వైపు ఉండటంతో తెలంగాణా ప్రాంతంలో మరమ్మత్తు పనుల వ్యవహారం బయటపడలేదు. ఏదేమైనా ప్రభుత్వం ఆగ్రహం దెబ్బకు కంపెనీ యాజమాన్యం దిగొచ్చిందనే చెప్పాలి. మరమ్మత్తులకు సుమారు రు. 500 కోట్లు ఖర్చవుతుందని కంపెనీయే అంచనాలు వేసింది. అంటే ఆ మొత్తాన్ని ఇపుడు కంపెనీయే భరించి మరమ్మత్తులు చేయాల్సుంటుంది. ఒక నిర్మాణ సంస్ధ ప్రభుత్వంతో పెట్టుకుంటే పర్యవసానాలు ఎలాగుంటుందనే విషయం యాజమాన్యానికి అనుభవం అయినట్లుంది. అందుకనే ప్రభుత్వ ఆగ్రహానికి జడిసి, చడీ చప్పుడు చేయకుండా దిగొచ్చి మరమ్మత్తులు మొదలుపెట్టింది.