కేసీయార్ కు ఉచ్చు బిగుస్తోందా ?

కేసీయార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే అనుమానంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజి రిజర్వేయర్ నిర్మాణ లోపాలే ఇపుడు కేసీయార్ కు శాపాలుగా మారబోతున్నాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది ఆధ్వర్యంలో మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్ధ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

బయటపడిన లోపాలు, వాటి మరమ్మత్తులు, అంచనా వ్యయం తదితరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంస్ధ ప్రతినిధులు మాట్లాడుతు మేడిగడ్డ బ్యారేజి డిజైన్ తమది కాదని చెప్పినట్లు సమాచారం. బ్యారేజి నిర్మాణానికి తమను డిజైన్ తయారుచేయమని చెప్పిన అప్పటి ప్రభుత్వం తామిచ్చిన డిజైన్ను తీసుకోలేదన్నారట. డిజైన్ మొత్తం కేసీయారే ఇచ్చారని, తానిచ్చిన డిజైన్ ప్రకారమే బ్యారేజి నిర్మాణం జరగాలని కేసీయార్ ఆదేశించినట్లు చెప్పారు. బ్యారేజి నిర్మాణంలో తమ సొంత నిర్ణయం ఏమీలేదని అంతా కేసీయార్ చెప్పినట్లే చేసినట్లు అంగీకరించారని తెలిసింది.

ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించినా ఇదే విషయాన్ని తాము చెప్పటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతినిధులు మంత్రితో చెప్పారట. మేడిగడ్డపై రెండు అంచెల విధానాన్ని అవలంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొదటిదేమో జ్యుడీషియల్ విచారణ. రెండోదేమో నిపుణులతో విచారణ. ఇందులో ఏది తొందరగా అవుతుందో చూసుకుని వచ్చే రిపోర్టు ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

సో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే కేసీయార్ చుట్టూ ఉచ్చుబిగుస్తున్న విషయం అర్ధమైపోతోంది. నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజికి పగుళ్ళు వచ్చినట్లు ఇప్పటికే ఢిల్లీ నుండి వచ్చిన నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ఇదే సమయంలో పిల్లర్లు, బ్యారేజికి పగుళ్ళ రిపేర్ల బాధ్యతలు ఎల్ అండ్ టీనే చేయాలని, మొత్తం వ్యయాన్ని భరించాలని ఉత్తమ్ తేల్చిచెప్పినట్లు సమాచారం. నిర్వహణ కాలపరిమితి అయిపోయిందని చెప్పి తప్పించుకుంటానంటే కుదరదని స్పష్టంగా చెప్పారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.