రామోజీరావు దగ్గర పని చేసిన పోసాని ఇప్పుదు తిడుతున్నాడు

మీడియా మొఘల్ రామోజీరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నటుడు కం ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళీ. రామోజీపై తీవ్ర విమర్శలు.. ఘాటైన ఆరోపణలు చేసే వేళలో.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను మార్గదర్శి చిట్ ఫండ్ లో పని చేసిన విషయాన్ని చెబుతూ.. 1985లో సికింద్రాబాద్ బ్రాంచ్ లో తాను మార్గదర్శి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశానని చెప్పారు. అప్పట్లో తాను రామోజీని నిజాయితీపరుడుగా ఊహించుకునేవాడినని చెప్పారు.

కానీ.. రామోజీ పేదల డబ్బుల్ని దోచుకు తింటున్నట్లుగా ఆరోపించారు. మార్గదర్శి మేనేజర్ ఒక్కొక్కరు నెలకు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్న పోసాని..విద్యార్థులకు జగన్ ప్రభుత్వం ట్యాబ్ లు అందజేస్తే.. వాటిల్లో బూతు వీడియోలు చూస్తున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నట్లుగా మండిపడ్డారు. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అన్న పోసాని.. తన మీడియా సంస్థలో తప్పుడు రాతలు రాస్తూ.. అసభ్య కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.

లక్ష్మీపార్వతి గురించి రామోజీరావు పిచ్చి రాతలు రాశారన్న మండిపాటును వ్యక్తం చేసిన పోసాని.. కమ్మవాళ్లలో కూడా కేవలం తన చెంచా అయిన చంద్రబాబును మాత్రమే ముఖ్యమంత్రి కావాలని రామోజీరావు కోరుకుంటారన్నారు. అయితే.. రామోజీ మీడియా సంస్థల్లో రాసినట్లు కాకుండా.. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ లలో అన్ని ఓపెన్ చేయటానికి పర్మిషన్ ఉండదన్నారు. పరిష్మన్ ఉన్న వాటిని తప్ప మరింకేవీ చూడలేరన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదని కోరుకుంటారని.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే రామోజీ కోరికగా పేర్కొన్నారు. సీఎం జగన్ ను రామోజీరావు అకారణంగా ద్వేషిస్తారని మండిపడ్డారు. పోసాని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.