టీడీపీ స‌రికొత్త వ్యూహం… ఈ నెల 18 ముహూర్తం ఫిక్స్!

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు.. ఇక నుంచి మ‌రో ఎత్తు.. అన్న‌ట్టుగా టీడీపీ వ్యూహం మార్చుకుంటోంది. ఈ నెల 17తో నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మాప్తం కానుంది. నిజానికి ఇచ్ఛాపురం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ, కొన్నిఅవాంత‌రాలు.. యాత్ర‌కు ఆటంకం క‌లిగించాయి. దీంతో ముందు వ‌డివ‌డిగా సాగి..షెడ్యూల్ క‌న్నా వేగంగా ముందుకు సాగిన యాత్ర ఆగిపోయింది. త‌ర్వాత‌.. గ‌త నెల 27న తిరిగి ప్రారంభించారు. అయితే.. ఇది కూడా తుఫాను కార‌ణంగా.. నిలిచిపోయింది. ఏదేమైనా.. ఎక్క‌డ వ‌ర‌కు న‌డిచామ‌న్న‌ది కాకుండా.. ఈ నెల 17తోనే దీనికి ముగింపు ప‌ల‌కాల‌ని మ‌రోసారి నిర్ణ‌యించారు.

17న ఎక్క‌డ పాద‌యాత్ర ఉంటే.. అక్క‌డ ముగింపు స‌భ పెట్టి.. త‌ర్వాత రోజు నుంచి పార్టీ కార్య‌క్రమాల్లో జోరు పెంచాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి స‌ర్వం సిద్దం చేసింది. తాజాగా చంద్ర‌బాబు-జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల భేటీలోనూ ఈ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ నెల 18 నుంచి ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు. 17న జ‌ర‌గ‌నున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను విజ‌యవంతం చేసే బాధ్య‌త‌ను ఇరు పార్టీలూ తీసుకున్నాయి. అనంత‌రం .. జిల్లాల స్థాయిలో ఇరు పార్టీల నాయ‌కులు సంయుక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు షెడ్యూల్ ఖ‌రారు చేయ‌నున్నారు.

జ‌న‌వ‌రి 15 త‌ర్వాత‌.. మండ‌ల‌స్థాయిలోనూ.. నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. వారానికి ఒక చోట బ‌హిరంగ స‌భ‌లు.. గ్రామీణ ప్రాంతాల్లో వ‌లంటీర్ల త‌ర‌హాలో ఇరు పార్టీల నుంచి చ‌దువుకున్న‌వారిని ఎంపిక చేసి.. మెనిఫెస్టోపై అవ‌గాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు నెల‌రోజుల ముందు.. ఇరు పార్టీలూ.. సంయుక్తంగా.. రాష్ట్రంలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల‌ను కూట‌మి దిశ‌గా ముందుకు న‌డిపించాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను ముందుగానే క‌లుపుకోవ‌డం ద్వారా.. వారి ఓట్ల‌ను కూడా స‌మీక‌రించాల‌ని భావిస్తున్నారు.

తెలంగాణ‌లో పొత్తులు చివ‌రి నిమిషం వ‌ర‌కు తేల‌క పోవ‌డంతో కొన్ని పార్టీలు న‌ష్ట‌పోయాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలో అలాకాకుం డా.. ముందుగానే పొత్తులు పూర్తి చేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. టికెట్ల కేటాయింపు సంగ‌తి ఎలా ఉన్నా.. నాయ‌కుల్లో మ‌నోధైర్యం, ఓటు బ్యాంకు స‌డ‌ల‌కుండా చూసుకోవ‌డం.. త‌ప్పుడు ఓట్ల‌ను తొల‌గించ‌డం.. ఇలా.. ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టాల‌ని, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని న‌రి్ణ‌యించారు.