30 సీట్ల‌కు జ‌న‌సేన ప‌ట్టు.. కీల‌క భేటీలో దీనిపైనే చ‌ర్చ‌…!

వ‌చ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 30 సీట్లు త‌మ‌కు కేటాయించాల‌ని జ‌న‌సేన ప‌ట్టుద‌ల‌గా ఉందా? పార్ల‌మెంటుస్థానాల్లో నాలుగు కోరుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి.. జ‌న‌సేన వ‌ర్గాలు. తాజాగా హైద‌రాబాద్‌లో సీట్ల విష‌యంపైనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు భేటీ అయిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోయినా.. క్షేత్ర‌స్థాయిలో ఇరు పార్టీలు నిర్వ‌హించిన సమ‌న్వ‌య స‌మావేశాలు.. వెలుగు చూసిన వివాదాలు.. అదేవిధంగా ప‌వ‌న్ నిర్వ‌హించిన‌.. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశాల గురించి చంద్ర‌బాబుతో ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ః త‌న పార్టీ నేత‌ల‌తో ఇప్ప‌టికి మూడు సార్లు విస్తృత స‌మావేశాలు నిర్వ‌హించి.. వారి అభిప్రాయం తీసుకున్నారు. ప‌ద‌వులు వ‌ద్దని.. తాను కూడా తీసుకోన‌ని చెప్పారు. ప‌ద‌వులు ఆశిస్తే.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌లేమ‌ని.. పొత్తులు కూడా ఉండ‌బోవ‌ని హెచ్చ‌రించారు. వైసీపీని త‌రిమి కొట్టాలంటే.. పొత్తుల‌తోనే ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. అయితే.. ఈ క్ర‌మంలో కొంద‌రు నాయ‌కులు.. టికెట్ల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. తెలంగాణ‌లో మాదిరిగా కాకుండా.. ఏపీలో ముందుగానే ఒక నిర్ణ‌యానికి రావాల‌ని.. 40 – 50 స్థానాలు కావాల‌ని.. కీల‌క నాయ‌కులు ప‌వ‌న్‌కు సూచించారు.

ఇక‌, స‌మ‌న్వ‌య స‌మావేశాల్లోనూ ఇదే త‌ర‌హా డిమాండ్లు వినిపించాయి. టీడీపీ-జ‌నసేన నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త రావాలంటే.. ముందుగా టికెట్ల విష‌యాన్ని తేల్చాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్ని విష‌యాల‌ను ప‌వ‌న్ చంద్రబాబుతో చ‌ర్చించారు. దీనిలో ప్ర‌ధానంగా త‌మ పార్టీ నాయ‌కులుకోరుతున్న‌ట్టుగా కాక‌పోయినా.. 30 స్థానాలు అసెంబ్లీకి.. నాలుగు పార్ల‌మెంటు స్థానాల‌ను కేటాయించాల‌ని ప‌వ‌న్ కోరిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చూచాయ‌గా చెబుతున్నాయి. దీనిపై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కూడా అంటున్నాయి.

“ప్ర‌స్తుతం రెండు పార్టీల పొత్తు విష‌యాన్ని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుని.. ప్ర‌జ‌ల మ‌న‌సులోకి ఎక్కించాలి. ఆ త‌ర్వాత టికెట్ల విష‌యం చూద్దామ‌ని చంద్ర‌బాబు సున్నితంగా చెప్పిన‌ట్టు స‌మాచారం” అని జన‌సేన ముఖ్య‌నాయ‌కుడు ఒక‌రు హైద‌రాబాద్‌లో వ్యాఖ్యానించారు. 30 ఇచ్చినా.. 20 ఇచ్చినా.. ఈ ద‌ఫా జ‌న‌సేన గెలుస్తుంద‌ని.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్ల‌డంలో విఫ‌ల‌మైన కార‌ణంగానే అప్ప‌ట్లో ఫ‌లితం రివ‌ర్స్ అయింద‌ని.. ఇప్పుడు మాత్రం.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యామ‌ని.. అదే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈయ‌న ఉమ్మ‌డి గుంటూరు జిల్లా నుంచి ఒక కీల‌క స్థానాన్ని ఆశిస్తున్నారు.