తెలంగాణ ఎన్నిక‌ల‌కే ఇంత‌.. ఏపీ ఎన్నిక‌లైతే ఇంకెంత‌?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంరంభం ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. మూడు ప్ర‌ధాన పార్టీలు.. వెర‌సి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఘ‌ట్టం పూర్త‌యిపోయింది. కానీ, ఎన్నిక‌ల వేడి మాత్రం ఇంకా చ‌ల్లార‌లేదు. ఈ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం.. ఇంకా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. దీనికి కార‌ణం.. నాయ‌కులు, పార్టీల మ‌ధ్య చెల‌రేగిన మాట‌ల మంట‌లు.. జంపింగుల యుద్ధాలు.. ట్విస్టులు, కౌంట‌ర్లు.. ఒక్క‌టేమిటి.. అన్నీ ఇన్నీకావు.

ఏకంగా ఎన్నిక‌ల సంఘంతో మొట్టికాయ‌లు వేయించుకునే ప‌రిస్థితి నుంచి నెటిజ‌న్ల ట్రోల్స్‌కు గుర‌య్యే దాకా.. ఇదో పెద్ద యుద్ధ‌మే. మ‌ధ్య‌లో ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, దేవ దూత‌.. కేఏపాల్ జిమ్మిక్క‌లు కేమిడీ షోలు.. నాయ‌కుల ప్ర‌చార ఆర్భాటాలు.. కాంగ్రెస్‌ గ్యారెంటీలు.. మోడీ వారెంటీలు.. నేత‌ల తంటాలు.. వెర‌సి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ఒక స‌ర్క‌స్ ఫీట్ అయిపోయింది. ఎవ‌రూ ఎవ‌రికీ తీసిపోరు. ఒక‌రినిమించి ఒక‌రు.. ఒక‌రిని దాటి మ‌రొక‌రు.. ఇలా.. ప్ర‌తి ఒక్క‌రూ హీటెక్కించారు.

మొత్తానికి మ‌రోవైపు.. కోట్ల‌లో పందేలు. మా నాయ‌కుడు గెలుస్తాడ‌ని ఒక‌రు ఇంకో నాయ‌కుడు గెలుస్తాడ‌ని మ‌రొక‌రు… తెలంగ‌ణ ఎన్నిక‌లు ఒక మ‌హాసంగ్రాన్ని సృష్టించాయి. అయితే.. ఇది కేవ‌లం 119 నియోజ‌క‌వర్గాల‌కు.. చెందిన క‌థ‌. దీనికే ఇంత ఉంటే.. ఇక‌, 175 నియోజ‌క‌వ‌ర్గాలున్న ఏపీ ప‌రిస్థితి ఎలా ఉంటుంది? మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో ఎలాంటి ప‌రిస్థితి ఉంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

అన్నింటికీ మించి ఏపీలో కేవ‌లం రెండు పార్టీల మ‌ధ్యే కీల‌క పోరు సాగ‌నుంది. మాట‌ల‌తూటాలైనా.. మ‌రేమైనా.. ఈ రెండు పార్టీల‌కే ప‌రిమితం కానుంది. అవే.. టీడీపీ, జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం ఒక‌వైపు.. వైసీపీ ఒక్క‌టీ మ‌రోవైపు. దీంతో రాజ‌కీయ కాక మ‌రింత పెరుగుతుంద‌నేది తెలిసిందే. ఇటు సినీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాట‌ల తూటాలు.. మ‌రోవైపు చంద్ర‌బాబు జోరు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌సంగాల‌తో 2024 ఎన్నిక‌లు ఒక రేంజ్‌లో కాక‌రేప‌నున్నాయి.

చాలెంజ్‌లు, స‌వాళ్లు.. కౌంట‌ర్లు, ట్విస్టులు, జంపింగులు, రివేంజ్ రాజ‌కీయాలు, మ‌ధ్య‌లో విశాఖ నుంచి పోటీ చేస్తాన‌ని చెబుతున్న కేఏ పాల్ స‌టైర్లు.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల స‌మ‌రం.. రాజ‌ధాని రైతుల వీరావేశం, నిరుద్యోగుల కోలాహ‌లం.. ఇలా ఒక‌టా రెండా.. అనేక అంశాలు.. ఏపీ రాజకీయాల‌ను ఎన్నిక‌ల‌ను ప్ర‌భావి తం చేసేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో ఏపీ ఎన్నిక‌ల ఎగ్జైట్‌మెంట్‌.. పీక్ స్థాయికి చేరుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.