డిప్యూటీ వ‌ద్దు.. సీఎం సీటే కావాలి.. ముదిరిన వివాదం!

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలకు తావివ్వ‌కూడ‌ద‌ని అంద‌రూ భావించినా.. అలాంటి వాతావ‌ర‌ణానికి చెక్ పెట్టేలా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించినా.. చివ‌రి నిముషంలో మాత్రం గ్రూపు రాజ‌కీయాలే ప్రారంభమయ్యాయి. హైద‌రాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

ఖ‌మ్మంలోని మ‌ధిర నుంచి విజ‌యం ద‌క్కించుకున్న సీనియ‌ర్ నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్కకు పార్టీ అధిష్టానం ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ఖ‌రారు చేయాల‌ని భావించింది. ఈ కోణంలోనే ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే.. దీనికి చివ‌రి నిముషంలో భ‌ట్టి అడ్డుప‌డిన‌ట్టు తెలిసింది. డిప్యూటీ వ‌ద్దు.. ఇస్తే సీఎం సీటే కావాలి. లేక‌పోతే.. ఇలానే ఉండిపోతా! అని భీష్మించిన‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం ఊపందుకుంది.

మ‌రోవైపు.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఖ‌మ్మం జిల్లాకు చెందిన మ‌రో కీల‌క నాయ‌కుడు కూడా వాద‌న‌కు దిగిన‌ట్టు స‌మాచారం. ఈ స‌మ‌యంలో వాద‌న‌లు.. ప్ర‌తివాద‌న‌లు కూడా జ‌రిగిన‌ట్టు తెలిసింది. రేవంత్‌కే డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇవ్వాల‌ని.. తాము పార్టీకోసం ఎంతో కృషి చేశామ‌ని.. నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన వారిని ఎలా ఎన్నుకుంటార‌ని.. భ‌ట్టి తీవ్ర‌స్థాయిలో వాద‌న‌ల‌కు దిగిన‌ట్టు తెలిసింది. పైగా ఈ సంప్ర‌దాయం పాటిస్తే..పార్టీ జాతీయ‌స్థాయిలో దెబ్బ‌తినే ప‌రిస్థితి కూడా వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపిన‌ట్టు స‌మాచారం. దీంతో వివాదం పెద్ద‌ది కావ‌డం.. విష‌యాన్ని అగ్ర‌నేత‌ల దృష్టికి తీసుకువెళ్ల‌డంతో సీఎం ప్ర‌క‌ట‌న ఆగిపోయింది.

ఈరోజు రాత్రికి ఢిల్లీకి ఏఐసీసీ పరిశీలకులు వెళ్లనున్నారు. బేగంపేట అయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి శివకుమార్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.