అన్న‌ద‌మ్ములు-భార్యాభ‌ర్త‌లు-మామా అల్లుళ్లు!

తాజాగా జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒకే కుటుంబం నుంచి అనేక మంది పోటీ చేశారు. వీరిలో చాలా మంది ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. కాంగ్రెస్ జోరును కూడా త‌ట్టుకుని నిల‌బ‌డిన వారిలో కొంద‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో బీఆర్ ఎస్‌నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయ‌కులు ఉన్నారు. ఇలాంటివారిలో అన‌దమ్ములు, భార్యాభ‌ర్త‌లు, మామా అల్లుళ్లు కూడా.. గెలుపు గుర్రం ఎక్కారు.

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బ్ర‌ద‌ర్స్ అన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ కూడా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో రాజ‌గోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి విజ‌యం సాధించ‌గా.. వెంక‌ట‌రెడ్డి న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కారు ఇద్ద‌రూ అసెంబ్లీలో అడుగు పెట్ట‌నున్నారు. కాలం క‌లిసి వ‌స్తే.. ఒక‌రు మంత్రి కూడా కానున్నారు.

అలాగే.. గ‌డ్డం బ్ర‌ద‌ర్స్ కూడా.. అసెంబ్లీలో అడుగు పెట్ట‌నున్నారు. గ‌డ్డం వివేక్‌.. కాంగ్రెస్ టికెట్‌పై చెన్నూరు నుంచి విజ‌యం సాధించారు. అదేవిధంగా గెడ్డం వినోద్ కాంగ్రెస్ నుంచి బెల్లంప‌ల్లి నుంచి పోటీ చేశారు. ఇద్ద‌రూ గెలుపు గుర్రాలు ఎక్కారు. దీంతో అన్న‌ద‌మ్ములు అసెంబ్లీలోకి అడుగులు వేయ‌నున్నారు.

ఇక‌, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, ప‌ద్మావ‌తి రెడ్డి. వీరిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. అయితే.. వీరికి కూడా కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క‌రే గెలిస్తే. ఇప్పుడు మాత్రం ఇద్ద‌రూ గెలుపు గుర్రాలు ఎక్కారు. దీంతో వీరు కూడా.. అసెంబ్లీకి క‌లిసే అడుగులు వేయ‌నున్నారు. అధిష్టానం క‌రుణిస్తే.. ప‌ద్మావ‌తికి మంత్రి ప‌దవి కూడా ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కోదాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇక‌, మామా అల్లుళ్లు. బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి చేమ‌కూర మ‌ల్లారెడ్డి, ఆయ‌న సొంత అల్లుడు.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డిల‌కు బీఆర్ఎస్ టికెట్లు ల‌భించాయి. దీంతో మ‌ల్లారెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న అల్లుడు.. మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ కూడా విజ‌యం సాధించారు. దీంతో మామా అల్లుళ్లు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్ట‌నున్నారు.