పోలింగ్ వేళ‌.. ‘సాగ‌ర్’ గోల‌.. వ్యూహాత్మ‌క‌మా?

ఒక‌వైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కే ఈ పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దీంతో సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌లు ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. అయితే.. ఇంత‌లోనే సాగునీటి ప్రాజెక్టుల వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద‌.. ఏపీ, తెలంగాణ పోలీసులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఏపీ స‌రిహ‌ద్దుల్లోని అన్ని గేట్ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం మూసేసింది.

అంతేకాదు..ఈ రోజు(గురువారం) ఉద‌యం 5 గంట‌ల నుంచి ఏపీ పోలీసులు భారీ ఎత్తున నాగార్జున సాగ‌ర్ వద్ద‌కు చేరుకుని ర‌హ‌దారి వెంబ‌డి.. బారికేడ్లు కూడా పెట్టారు. దీంతో అలెర్ట‌యిన‌.. తెలంగాణ పోలీసులు కూడా భారీ సంఖ్య‌లో అక్క‌డ‌కు చేరుకున్నారు. సాగ‌ర్ జ‌లాల‌ను తెలంగాణ‌లోకి వెళ్ల‌కుండా.. ప్రాజెక్టు వ‌ద్ద పెట్టిన బారికేడ్ల‌ను పోలీసులు సంర‌క్షించే ప‌నిలో ఉన్నారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల పోలింగ్ వేళ ఈ విష‌యం వివాదంగా మారింది.

ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వారు 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌పైకి చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్‌కు సంబంధించి నిర్వహణ విషయం నీటి పారుదలకు సంబంధించినదని, ముళ్లకంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు. స్పందించకపోవడంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరిగి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు నీటి విడుదల, భద్రతా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది.

ఇక‌, ఈ విష‌యం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. దీనిని ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో భాగంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా.. ఇది బీఆర్ ఎస్ ఆడుతున్న నాట‌కంగా పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుని.. సెంటిమెంటుతో ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇదిలావుంటే.. గ‌తంలో మునుగోడు ఉప ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు .. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి పోలింగ్ వేళ‌.. సాగ‌ర్‌ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది.