ఇండిపెండెంట్ల‌ను ప‌క్క‌న పెట్ట‌లేక పోతున్నారే…!

సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా.. ఎన్నిక‌లు రాగానే కొంద‌రు ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు బ‌రిలో ఉంటా రు. కొంద‌రు ఫ్యాష‌న్‌గా పోటీ చేసేవారు.. మ‌రికొంద‌రు.. అసంతృప్తితో రంగంలోకి దిగేవారు. ఇంకొంద‌రు త‌మ‌కు హ‌వా బాగుంద‌ని.. అనుకునేవారు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలో దిగుతారు. అయితే.. వీరిని పెద్ద‌గా ప‌ట్టించుకునేందుకు ప్ర‌ధాన పార్టీలు ప్రాధాన్యం ఇవ్వ‌వు. వారంతో ఓడిపోతార‌నే లెక్క‌లు ఉండ‌డమే దీనికి కార‌ణం. కానీ, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ల లెక్క‌లు వేరేగా ఉన్నాయి.

రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 72 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. వీరిలో మెజారిటీ అభ్య‌ర్థు లు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు కావ‌డం.. పైగా.. ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తి వీరికి క‌లిసి వ‌స్తుండ‌డం.. ఇంకొన్ని చోట్ల నిరుద్యోగులు.. స‌ర్కారుపై ఆగ్ర‌హంతో రంగంలోకి దిగ‌డం.. వంటివి ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. దీంతో ఇండిపెండెంట్ల‌ను ఈ ద‌ఫా లైట్ తీసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. నిజానికి గ‌త రెండు ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. ఈ సారి అభ్య‌ర్థుల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది.

ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీలు గ‌ట్టి అభ్య‌ర్థుల‌నే రంగంలోకి దింప‌డం.. ప్ర‌చారాన్ని ఉదృ తం చేయ‌డం. వంటివి క‌నిపిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఎవ‌రు గెలిచినా… భారీ మెజారిటీ న‌మోదు కావ‌డం అంటే.. న‌క్క తోకతొక్కిన‌ట్టే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు మెజారిటీపై నాయ‌కులు ఆశ‌లు పెట్టుకునేవారు. ముందుగానే వెల్ల‌డించేవారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. గెలిస్తే.. చాలు జీవుడా అని లెక్క‌లు వేసుకుంటున్నారు.

దీనికి కార‌ణం ఓట్లు చీల్చ‌డంలో ఇండిపెండెంట్ల పాత్ర గ‌ణ‌నీయంగా ఉంద‌ని అన్ని పార్టీలు అంచ‌నా వేస్తుండ‌డమే. అందుకే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇండిపెండెంట్ల‌ను త‌మ దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. 32 మంది అభ్య‌ర్థులు బ‌లంగా ఉన్నారు. స్థానికంగా వారికి ఉన్న బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం స‌పోర్టు, సోష‌ల్ మీడియా ద‌న్ను, మ‌హిళ‌ల‌నే సానుభూతి, ఉన్న‌త విద్య చ‌దివార‌న్న భావ‌న‌.. వెర‌సి ఈ సారి ఇండిపెండెంట్లు కూడా.. ప్ర‌ధాన అభ్య‌ర్థుల‌కు దీటుగానే పోటీ ప‌డుతున్నార‌నేది వాస్త‌వం. ఇది కీల‌క అభ్య‌ర్థుల‌కు సెగ పుట్టిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.