గుంటూరు జిల్లాలో తెలుగు తల్లికి అవమానం.. ఇంత దారుణమా?

తాను పుట్టిన ఊరు మీదా.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం మీదా ప్రేమాభిమానాలు లేకుంటే ఏమవుతుందన్న మాటకు కొద్ది కాలం క్రితం వరకు సరైన ఉదాహరణ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు.

ప్రాంతం మీద అభిమానం ఉంటే.. ఎంత మేలు జరుగుతుందో తెలంగాణను చూస్తే.. అర్థమవుతుంది. కులాల కుంపట్లతో తరచూ రాజకీయ కుస్తీలకు దిగే ఆంధ్రాకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. అయినప్పటికీ.. తన ప్రాంతం మీద అభిమానం ఎంతన్న విషయంలో సందేహమే.

తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కూడా కోస్తా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర లాంటి విభజన మాటలే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి జరిగిన విభజన గాయం సరిపోదా? అని మూడు ప్రాంతాలకు చెందిన వారు నిలదీస్తే.. నేతలు తమ తీరును మార్చుకోరా? కానీ.. అలాంటివేమీ చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇవాళ తెలుగు భాషా దినోత్సం. తెలుగు జాతికి మూలమైన అమ్మ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకోవాలి? బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ విషయాలేమీ పెద్ద పట్టనట్లుగా వ్యవహరిస్తారు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు. దీనికి తగ్గట్లే.. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి నేతలు కానీ.. అధికారులు కానీ కనీసం పూలమాల వేయకపోవటం చూస్తే.. ఆంధ్రోళ్లకు తెలుగు తల్లి మీద ఉన్న అభిమానం ఏ పాటిదో ఇట్టే అర్థం కాక మానదు.

మొన్నటివరకు ఏటా జరిగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహాల్ని అందంగా ముస్తాబు చేసే తీరుకు భిన్నంగా.. ఈ ఏడాది ఎలాంటి వేడుకలు జరగకపోవటం చూసినోళ్లంతా వేదన చెందుతున్నారు.

ఆంధ్రోళ్లు తమను తాము పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయ్యిందన్న ఆగ్రహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. దీనికి తగ్గట్లే..తమను తామే కాదు.. తమ తల్లిని కూడా మర్చిపోయే నరసరావుపేట లాంటి ప్రాంతాల్లోని నేతలు.. అధికారుల్ని ఏమనాలి?