బీజేపీ డౌన్ ఫాల్ కు ఈటల కారణమా ?

బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి అలియాస్ రాములమ్మ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తెలంగాణాలో బీజేపీ డౌన్ ఫాల్ కు హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందరే కారణమన్నారు. బీజేపీలో ఈటల చేరిన తర్వాతే పార్టీకి దరిద్రం పట్టుకున్నదన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలుచేశారు. ఆమె చేసిన ఆరోపణలను గమనిస్తే అసలు ఈటలను బీజేపీలోకి చేర్చిందే కేసీయార్ అన్నట్లుగా ఉంది. ఎందుకంటే బీజేపీలో కేసీయార్ నాటిన విత్తనమే ఈటల అని రాములమ్మ ఆరోపించారు.

రాములమ్మ ఆరోపణను జాగ్రత్తగా గమనిస్తే ఈటలను కేసీయారే బీజేపీలోకి పంపినట్లుగా అర్ధమవుతుంది. బీజేపీలో కేసీయార్ నాటిన విత్తనం మొలకెత్తి మొక్కగా మారి పార్టీనే దెబ్బతీసిందని విజయశాంతి మండిపడ్డారు. ఆయన పార్టీలో చేరిన తర్వాతే నేతల మధ్య విభేదాలు వచ్చాయని, కొందరి మధ్య విభేదాలు పెరిగిపోయాయన్నారు. ఈటల ఢిల్లీకి వెళ్ళి పదేపదే ఫిర్యాదులు చేసిన కారణంగానే అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించినట్లు ఆరోపించారు.

కేసీయార్ కు అనుకూలంగా ఉండాలనే బండిని తప్పించటంలో ఈటల కీలకపాత్ర పోషించినట్లు ఆమె ఆరోపించారు. బండిని తొలగించిన తర్వాతే పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయిందన్నారు. పార్టీ గ్రాఫ్ పడిపోయిన కారణంగానే సీనియర్ నేతలు చాలామంది ఒక్కొక్కళ్ళుగా పార్టీని వదిలేసినట్లు చెప్పారు. కేసీయార్-బీజేపీ రహస్య ఒప్పందం ప్రకారమే బండిని అగ్రనేతలు అధ్యక్షుడిగా తప్పించారనే ప్రచారాన్ని జనాలు కూడా నమ్మినట్లు రాములమ్మ గుర్తుచేశారు. కేసీయార్ అవినీతిని బయటకు తీస్తామని, కేసులు పెట్టి దర్యాప్తు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కారణంగానే తనతో పాటు చాలామంది బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు.

కేసీయార్-బీజేపీ ఏకమైపోవటంతో తాము పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని డిసైడ్ అయినట్లు చెప్పారు. కేసీయార్ అవినీతితో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పాత్రను ఈడీ ఆధారాలతో సహా నిరూపించినా ఎందుకని యాక్షన్ తీసుకోలేదో జనాలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీయార్ అంతు తేలుస్తామని హామీ ఇచ్చిన కారణంగానే తాను హస్తంపార్టీలో చేరినట్లు చెప్పారు. మరి రాములమ్మ కోరిక కాంగ్రెస్ అయినా తీరుస్తుందేమో చూడాలి.