కేసీయార్లో అయోమయం పెరిగిపోతోందా ?

కేసీయార్లో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. ఎన్నికల బహిరంగసభల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధమవుతున్నట్లు లేదు. నిజామాబాద్, మెదక్, బోధ్ బహిరంగసభల్లో మాట్లాడుతు జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అని బల్లగుద్ది మరీ చెప్పారు. తొందరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల తర్వాత జోష్ అంతా ప్రాంతీయపార్టీలదే అని పదేపదే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే నిజమైతే మరి కేసీయార్ జాతీయపార్టీని ఎందుకు పెట్టినట్లు ?

ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను కేసీయార్ జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను ఏర్పాటుచేసినట్లు అప్పట్లో కేసీయార్ చెప్పుకున్నారు. అసలు సిసలు రాజకీయం అంటే ఏమిటో దేశానికి తాను బీఆర్ఎస్ ద్వారానే చూపిస్తానని అప్పట్లో పదేపదే చెప్పారు. మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ లో చాలాసార్లు పర్యటించారు. చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల నేతలతో సమావేశమయ్యారు.

జాతీయ పార్టీ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తానని చాలా మాటలు చెప్పారు. మహారాష్ట్రలో అయితే పదేపదే పర్యటించారు. చివరకు తెలంగాణాను కూడా వదిలేసి మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు తిరిగారు. బహిరంగసభలు కూడా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలకు కూడా అందుబాటులో ఉండని కేసీయార్ మహారాష్ట్ర నేతలతో మాత్రం రెగ్యులర్ టచ్ లో ఉండేవారు. కేసీయార్ వైఖరి చూసిన వాళ్ళు అప్పట్లో చాలా ఆశ్చర్యపోయారు.

సీన్ కట్ చేస్తే అప్పట్లో కేసీయార్ చేసిన పనులకు, మాట్లాడిన మాటలకు ఇపుడు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీలు ఎత్తిపోయాయని, భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అన్నది నిజమే అయితే మరి కేసీయార్ జాతీయపార్టీ ఎందుకు పెట్టారనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, వాదాలతోనే కేసీయార్ జనాల్లో బాగా పలుచనైపోతున్నారు. ఓడిపోతే హ్యాపీగా రెస్టు తీసుకుంటానని చెప్పిన మాటనే జనాలు చర్చించుకుంటున్నారు. ఇంతలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పటం మరో విచిత్రం.