నేతలకు కేసీఆర్ ఫుల్లు క్లాసు పీకారా ?

కామారెడ్డి లో గెలుపు కేసీయార్ అనుకున్నంత ఈజీగా ఉండేట్లు కనబడటం లేదు. ఎందుకంటే కామారెడ్డిలో గురువారం నామినేషన్ వేసిన కేసీఆర్ తర్వాత సిట్టింగ్ ఎంఎల్ఏ గంప గోవర్ధన్ ఇంట్లో నేతలు, క్యాడర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలామంది పనితీరుపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. నేతల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తిచూపి ఫుల్లుగా క్లాసులు పీకినట్లు సమాచారం. స్వయంగా తానే పోటీ చేస్తున్నా నేతల మధ్య ఈ సమన్వయ లోపం ఏమిటంటే మండిపోయారట.

విషయం ఏమిటంటే ఆధిపత్య గొడవలతో వివిధ సందర్భాల్లో ముగ్గురు నేతలపై ప్రత్యర్ధులు దాడులు చేశారు. దాంతో నియోజకవర్గంలో ఈ గొడవల ప్రభావం తీవ్రంగా చూపింది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ భర్త బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమ వర్గంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. అలాగే మరో ఇద్దరు నేతలు కూడా పార్టీలో సరిగా పనిచేయడం లేదు. ఇవన్నీ ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ కు అందుతున్నాయి. కేటీయార్ కూడా లోకల్ నేతలను పిలిపించుకుని గొడవలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కేటీయార్ ఎంత ప్రయత్నిస్తున్నా గొడవలు సర్దుబాటు కావటంలేదు. అందుకనే ఫైనల్ గా కేసీయారే రంగంలోకి దిగి నేతలందరినీ పిలిపించుకుని అందరికీ క్లాసులు పీకింది. అయితే కేసీయార్ క్లాసులు పీకిన తర్వాతైనా నేతలు పద్దతిగా పార్టీ గెలుపుకు పనిచేస్తారా అన్నదే అనుమానంగా ఉంది. ఎందుకంటే నేతల్లోని అసంతృప్తి, గొడవలు ఇప్పటికిప్పుడు బయటపడింది కాదు. గత ఐదేళ్ళుగా గొడవలున్నా వీళ్ళని కేసీయార్ ఎప్పుడూ పట్టించుకోలేదు.

ఇపుడు కూడా తాను స్వయంగా పోటీ చేస్తున్నారు కాబట్టే అందరినీ పిలిచి మాట్లాడారంతే. పార్టీలో నేతల మధ్య గొడవలు ఒక ఎత్తయితే జనాల్లో వ్యతిరేకత మరో ఎత్తు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇలాంటి కుటుంబాల్లోని ఓటర్లు సుమారు 30 వేలుంటాయని అంచనా. అలాగే కామారెడ్డి మున్సిపాలిటి మాస్టర్ ప్లాన్ పేరుతో చుట్టుపక్కల రైతుల భూములను ప్రభుత్వం తీసేసుకుంది. తమ భూములను తమకు వెనక్కు ఇచ్చేయాలని రైతులు ఎంత గోలచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలాంటి అనేక కారణాలతో ప్రభుత్వంపై మండుతున్న వివిధ వర్గాలు ఏమిచేస్తాయో చూడాలి.