పువ్వాడ – కేసీఆర్‌ను ఫుట్‌బాల్ ఆడేసిన తుమ్మ‌ల‌..!

కామెంట్‌:
“తుమ్మ‌లు.. త‌ప్పుల‌ను న‌మ్మ‌కండి. తుమ్మకు ముళ్లుంట‌యి.. వాటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. పువ్వాడ పువ్వులాంటోడు. మంచి సువాస‌న వ‌స్త‌ది. ఆయ‌న‌ను న‌మ్మండి. ఉప‌యోగం ఉంటుంది. పువ్వుల్లో పెట్టి చూసుకుంట‌డు” ఖ‌మ్మం స‌భ‌లో సీఎం కేసీఆర్ కామెంట్‌.

కౌంట‌ర్‌:
“ఔను.. పువ్వాడ పువ్వే. కానీ, పూజ‌కు ప‌నికిరాని వ‌య్యారి భామ పువ్వు. తుమ్మ చెట్ల‌కు ముళ్లున్నా.. దానిని నాగ‌లి చేసుకుని దున్నుకుంటే బ‌తుకు ఇస్తుంది. పంట‌లు పండేలా చేస్తుంది”-తాజాగా ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు చేసిన వ్యాఖ్య‌లు.

మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. నిన్న మొన్న టి వ‌ర‌కు ఒకే పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా ఇప్పుడు టికెట్ల నేప‌థ్యంలో పార్టీ మార‌డంతో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ ప‌రంప‌ర‌లో ఖ‌మ్మం నుంచి పోటీ చేస్తున్న ప్ర‌ధాన అభ్య‌ర్థుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

ఖ‌మ్మం నుంచి టికెట్ ఆశించిన తుమ్మ‌ల‌ను అన్ని విధాలా వాడుకున్న‌ బీఆర్ ఎస్ హ్యాండివ్వ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌కు జై కొట్టారు. ఈ క్ర‌మంలోనే టికెట్ కూడా సాధించారు. ఇక‌, ఇదే స్థానం నుంచి బీఆర్ ఎస్ త‌ర‌ఫున మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో తుమ్మ‌ల‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రి పువ్వాడ టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. పూట‌కో పార్టీ.. గంట‌కో కండువా! అంటూ. పువ్వాడ స‌టైర్లు వేశారు. ప్ర‌తి ఎన్నిక‌ల‌కు ఒక్కొక్క పార్టీ మారుతున్నారంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు.

గ‌తంలో టీడీపీ, త‌ర్వాత బీఆర్ ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల్లోకి తుమ్మ‌ల వ‌చ్చార‌ని అంటున్నారు. ఇక‌, తుమ్మ‌ల ముళ్ల కంప వంటి వాడ‌ని కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌పైనా తుమ్మ‌ల త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. పువ్వాడ పువ్వేమీ కాద‌ని.. ఆయ‌న కూడా జంపింగ్ జిలానీనేన‌ని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ‌కాలం సీపీఐలో ఉన్న పువ్వాడ కుటుంబం.. అజ‌య్ హ‌యాంలో ఆ పార్టీకి తూట్లు పొడిచి.. వైసీపీలో చేరార‌ని.. ఇది నీతా? అని ప్ర‌శ్నించారు.

తాను చచ్చేంత వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే ఉంటాన‌ని.. ఆ త‌ర్వాత‌.. వైసీపీని కూడా వ‌దిలేసి కాంగ్రెస్ పంచ‌న చేరార‌ని.. ఇప్పుడు బీఆర్ ఎస్‌లో ఉండి.. నాకు నీతులు చెబుతున్నార‌ని తుమ్మ‌ల వ్యాఖ్యానించారు. వారు చేస్తే సంసారం పక్క‌వారు పార్టీ మారితే వ్య‌భిచారమా ? అని నిల‌దీశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీ ప‌రిణామాల‌ను గుర్తించే తాను పార్టీ మారాన‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగే వారు తాను తెలుగుదేశంతోనే ఉన్నాన‌ని.. ఆ త‌ర్వాతే త‌న‌ను కేసీఆర్ బ‌తిమిలాడి పార్టీలో చేర్చుకున్న మాట నిజం కాదా ? అని ప్ర‌శ్నించారు.

త‌న‌ను వాడుకున్న కేసీఆర్ త‌ర్వాత‌.. అవ‌మానించార‌ని, అందుకే కాంగ్రెస్‌లోకి వ‌చ్చాన‌ని.. ఇది కూడా త‌న అనుచ‌రులు.. ఖ‌మ్మం జిల్లా అభివృద్ధితో పాటు ప్ర‌జ‌ల కోస‌మేన‌ని తుమ్మ‌ల చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒకే ద‌ఫాలో అటు కేసీఆర్‌, ఇటు పువ్వాడ‌ల‌కు తుమ్మ‌ల అదిరిపోయేలా ఇచ్చిన కౌంట‌ర్ మామూలుగా పేల‌డం లేదు.