అటు ఈటల… ఇటు రేవంత్.. కేసీఆర్ కు అంత ఈజీ కాదు

1983 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఎంపీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా కేసీఆర్ కు తిరుగేలేదు. సిద్ధిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలా వివిధ నియోజకవర్గాల్లో విజయ ఢంకా మోగించారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి గజ్వేల్ నుంచి పోటీ చేసి వరుసగా విజయాలు సాధించారు. ఇలాంటి నాయకుడు, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో మాత్రం పరిస్థితి కఠినంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి కేసీఆర్ కు అంత ఈజీ కాదనే చెప్పాలి.

ఈ సారి ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ను ఓడించాలనే సంకల్పంతో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. అందుకే కేసీఆర్ పై ఈ రెండు పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ను ఓడించి గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్న రెండు పార్టీలూ తమ కీలక నేతలను రంగంలోకి దించాయి. గజ్వేల్ లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. కేసీఆర్ లాగే వీళ్లు కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

ఓ వైపు తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్ లో పోటీకి దిగిన ఈటల.. గజ్వేల్ లో కేసీఆర్ కు ఓటమి రుచి చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ ప్రచారం మొదలెట్టారు. మరోవైపు తొలిసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కానీ అక్కడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ కు సవాలు తప్పడం లేదు. కేసీఆర్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ సాగుతున్నారు. మరోవైపు తన నియోజకవర్గం కొడంగల్ నుంచి కూడా రేవంత్ బరిలో నిలిచారు. మరి గజ్వేల్ లో ఈటలను, కామారెడ్డి లో రేవంత్ ను దాటి కేసీఆర్ విజయాలు సాధిస్తారేమో చూడాలి. ఇలా గెలిస్తే మాత్రం నాయకుడిగా కేసీఆర్ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందనే చెప్పాలి.