రాహుల్, ప్రియాంక క్యాంపేస్తారా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన సర్వేలన్నీ మిశ్రమ స్పందననే చూపించాయి. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని చెబితే మరికొన్ని సర్వేలు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వచ్చి ఆగిపోతుందని, రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఫలితాలను వెల్లడించాయి. దాంతో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధి, ప్రియాంకగాంధీలను పదేపదే తెలంగాణాలో పర్యటించేట్లుగా చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా వీళ్ళిద్దరినీ రెండు వారాలపాటు తెలంగాణాలోనే క్యాంపు వేయమని అడిగారట. ఇందుకు వీళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారని పార్టీవర్గాల సమాచారం. నామినేషన్ల ప్రక్రియ 10వ తేదీన అయిపోతోంది. తర్వాత ఉపసంహరణలు కూడా అయిపోతాయి. అప్పుడు నికరంగా అభ్యర్ధులు ఎవరన్నది తేలుతుంది. అందుకనే 15వ తేదీనుండి వీళ్ళద్దరితో విస్తృతంగా ప్రచారం చేయించాలని పీసీసీ అనుకున్నది.

ఇందుకనే వీళ్ళ పర్యటనలకు వీలుగా షెడ్యూళ్ళని కూడా రెడీచేస్తోంది. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ప్రచారానికి వీలుగా పార్టీ రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నది. ఇందులో ఒక హెలికాప్టర్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరోటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కేటాయించారు. అంటే అవసరాలకు కాస్త అటుఇటు అవసరాలకు అనుగుణంగా ఇతరులు కూడా ఉపయోగించే వెసులుబాటు పెట్టుకున్నారు. కాబట్టి ఈ రెండు హెలికాప్టర్లను రాహుల్, ప్రియాంక పర్యటనలకు కేటాయించబోతున్నారు.

ఎలాగు వీళ్ళ పర్యటనల్లో రేవంత్, భట్టి తదితరులు ఉండటం ఖాయమే. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలోనే రాహుల్, ప్రియాంకలు పర్యటనలు జరిగినట్లుంటుంది, హెలికాప్టర్లు వీళ్ళ ఆధీనంలోనే ఉన్నట్లుంటుందని పార్టీవర్గాలు చెప్పాయి. వీళ్ళ పర్యటనలను కూడా కాస్త కష్టపడితే గెలుపు ఖాయమని అనుకుంటున్న నియోజకవర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలకు రెండో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. గెలుపు అనుమానమే అని ఫీడ్ బ్యాక్ వచ్చిన నియోజకవర్గాలను మూడో జాబితాలో చేర్చారట. మరి వీళ్ళ పర్యటనల ద్వారా పార్టీ ఏమేరకు పుంజుంకుంటుందో చూడాలి.