కేసీయార్ కు కమీషన్ షాక్

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేసీయార్ కు ఎన్నికల కమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు స్కీమ్ కీలకంగా మారుతోంది. అందుకనే ఇదే పథకంపై కేసీయార్ ఎక్కడ మాట్లాడినా రైతు రుణమాఫీ చేయటానికి ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని చెబుతున్నారు. పథకం వర్తింప చేయడానికి అనుమతి ఇవ్వాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాసామని చెబుతున్నారు. కమీషన్ నుండి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.

ఎన్నికల కమీషన్ గనుక అనుమతిస్తే వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేస్తామని లేకపోతే ఎన్నికలు అయిపోగానే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెబుతున్నారు. అయితే ఇదే విషయమై తాజాగా ఎన్నికల కమీషన్ మాట్లాడుతు రైతుబంధు పథకం విషయమై ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ప్రతిపాదన లేదా లేఖ రాలేదన్నారు. ప్రభుత్వం నుండి ఏమైనా వస్తే అప్పుడు పరిశీలిస్తామని స్పష్టంగా చెప్పారు. అంటే రైతు రుణమాఫీపై కేసీయార్ చెబుతున్నదానికి, ఎన్నికల కమీషనర్ చెప్పిందానికి పూర్తి వ్యతిరేకంగా ఉందని అర్ధమైపోయింది.

రైతు రుణమాఫీపై ఎన్నికల కమీషన్ కు లేఖ రాయకుండానే రాసినట్లు కేసీయార్ పదేపదే చెబుతున్నారని జనాలకు అర్ధమైపోయింది. పైగా రైతుబంధు అమలుపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, కాంగ్రెస్ వల్లే రుణమాఫీ ఆగిపోయిందని కూడా కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కమీషనర్ మాట్లాడుతు తమకు అసలు ఎలాంటి పిర్యాదులు అందలేదని కూడా చెప్పారు. దీంతోనే కేసీయార్ అండ్ కో చెబుతున్నదంతా అబద్ధాలే అని అర్ధమైపోయింది.

రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటానికి ప్రభుత్వం దగ్గర అవసరమైన నిధులు లేవన్నది వాస్తవం. డబ్బులు లేని కారణంగానే 2018లోనే అమలవ్వాల్సిన హామీ ఇన్ని సంవత్సరాలైనా సంపూర్ణంగా అమల్లోకి రాలేదు. రాబోయే ఎన్నికల్లో రైతులంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లేయబోతున్నారనే ఫీడ్ బ్యాక్ రావటంతోనే కేసీయార్ హడావుడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయటం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఓటమిభయంతోనే రైతుల ఖాతాల్లో కేసీయార్ డబ్బులు వేస్తున్నారన్నది వాస్తవం. దీన్ని కప్పిపుచ్చుకుంటు కేసీయార్ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తు, కమీషన్ కు లేఖ రాసినట్లు అబద్ధాలు చెబుతున్నారు.