గ్రామ‌స్థాయిలో కాంగ్రెస్ జోరు.. మారుతున్న తెలంగాణ పాలిటిక్స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల క‌న్నా.. గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకు ఎక్కువ‌. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితాలోనూ గ్రామీణ ఓటరు చైత‌న్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ప్ర‌ధాన పార్టీలు గ్రామీణ ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ద‌ళిత బంధు, రైతు బంధు, 9 గంట‌ల విద్యుత్ వంటి వాటిని ప్ర‌ధాన ఎన్నికల అస్త్రాలుగా చేసుకుంది.

ఇక‌, కీల‌క‌మైన మ‌రో పార్టీ కాంగ్రెస్ కూడా గ్రామీణ స్థాయిలో దూకుడు పెంచింది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఫైర్ బ్రాండ్ల‌ను రంగంలోకి దింపిన కాంగ్రెస్‌.. గ్రామాల్లో మాత్రం ఇంటింటి ప్ర‌చారం.. స్థానిక స‌మ‌స్య‌లు.. రైతులు, రైతు కూలీలు.. ఇలా స్థానికంగా ఉన్న స‌మస్య‌ల‌పై దృష్టి పెట్టింది. అదేవిధంగా మ‌హిళ‌ల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, ఆరు గ్యారెంటీల‌ను నాయ‌కులు పూస గుచ్చిన‌ట్టు వివ‌రిస్తున్నారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల‌పై నేత‌లు ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ అన్ని గ్రామాల‌నూ క‌వ‌ర్ చేసేలా నాయ‌కులకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా మ‌హిళా ఓటుబ్యాంకును క‌వ‌ర్ చేసేలా నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్క ఛాన్స్‌, తెలంగాణ ఇచ్చింది మేమే అన్న సెంటిమెంటును కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ ఎస్ ట‌చ్ చేయ‌ని గ్రామాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తూ.. గ్రామ‌స్థాయిలో కాంగ్రెస్ నేత‌లు దూకుడు పెంచారు.

దీంతో తెలంగాణ రాజ‌కీయాల ముఖ చిత్రం గ్రామీణ స్థాయిలో మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల్లోప‌ట్ట‌ణ ఓట‌రు ప‌రిస్థితిని బ‌ట్టి పోలింగ్‌బూత్‌కు వ‌స్తాడు. కానీ, గ్రామాల్లో అయితే.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని.. గ‌త ఎన్నిక‌ల లెక్క‌ల‌ను కూడా ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న కాంగ్రెస్ గ్రామాల‌పై ప‌ట్టు బిగించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నందున ఈ దూకుడు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు కూడా అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి గ్రామీణ ఓటు ఎవరికి జై కొడుతుందో చూడాలి.