కేసీఆర్ గెలుపుకోసం చెమ‌టోడుస్తున్న కేటీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సారథి కేసీఆర్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు చోట్లా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాను ఇప్ప‌టికే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్‌తో పాటుగా కామారెడ్డి బ‌రిలోనూ గులాబీ ద‌ళ‌ప‌తి నిలిచారు. అయితే, అక్క‌డ గెలుపు అనుకున్నంత ఈజీ కాద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపును ప్ర‌భావితం చేసే అంశంపై ఫోక‌స్ పెట్టారు.

కామారెడ్డి ప‌ట్ట‌ణానికి మాస్ట‌ర్ ప్లాన్ రూపొందిస్తూ ఇటీవ‌లే డ్రాఫ్ట్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అయితే, దీనిపై నిర‌స‌న‌లు వెలువ‌డ్డాయి. మాస్ట‌ర్ ప్లాన్‌ను మార్చాల్సిందే అంటూ రైతు జేఏసీగా ఏర్ప‌డి స్థానికులు నిరసన కార్యక్రమాలు చేప‌ట్టారు. దీంతో వారిపై కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో స‌హ‌జంగానే ఈ ఆందోళ‌న‌ల‌ను విప‌క్షాలు ప్ర‌ధాన అంశంగా ప్ర‌చారంలో పెట్టాయి. ఇది ఖ‌చ్చితంగా కేసీఆర్ గెలుపును ప్ర‌భావితం చేయ‌గ‌లిగే అంశంగా మారిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. కామారెడ్డి రైతు జేఏసీ బృందంతో భేటీ జ‌రిపింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ కలిసింది. ఈ సందర్భంగా రైతులను హైద‌రాబాద్‌కు పిలిపించుకొని వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు.

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ రైతు జేఏసీ నేత‌ల‌కు హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్… ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి.. ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. కేసుల వివరాల గురించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ తో చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు.

మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం, కేసుల ఎత్తివేత‌పై డీజీపీతో మాట్లాడినందుకు కేటీఆర్ కి రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. మంత్రి కేటీఆర్ హామీపై పూర్తి భరోసా ఉందని రైతు జేఏసీ నాయకులు తెలిపారు. కాగా, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ బ‌రిలో దిగుతున్న కామారెడ్డిపై బీఆర్ఎస్ పెట్టిన ప్ర‌త్యేక ఫోక‌స్‌కు ఈ చ‌ర్చ‌లు అద్దం ప‌డుతున్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.