టీడీపీలో నూత‌న శ‌క్తి..

టీడీపీలో నూత‌నోత్తేజం క‌నిపిస్తోందా? ఆ పార్టీ దూకుడు పెరిగిందా? అంటే.. తాజాగా వెలుగు చూసిన సంఘ ట‌న‌లు ఔననే స‌మాధానాన్నే ఇస్తున్నాయి. చంద్ర‌బాబు అరెస్టు, జైలు ప‌రిణామాల అనంత‌రం… కొన్నాళ్లు పార్టీ కార్యక్ర‌మాలు స్త‌బ్దుగా సాగాయి. అయితే, చంద్ర‌బాబు కోసం అంటూ నిర‌స‌న‌లు నిర్వ‌హించారు. దీంతో దాదాపు 40 రోజుల కుపైగానే టీడీపీ ప్ర‌ధాన కార్యక్ర‌మాలు గాడిత‌ప్పాయి. కానీ, ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ ప్ర‌ధాన లైన్‌లోకి పార్టీ వ‌చ్చేసింది.

ముఖ్యంగా ‘నిజం గెల‌వాలి’ నినాదంతో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి చేప‌ట్టిన యాత్ర‌.. పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకువ‌చ్చిన‌ట్టు పార్టీ అభిమానులు.. విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజానికి రాజ‌కీయ‌మెరుగ‌ని భువ‌నేశ్వ‌రి తొలిసారి రోడ్డెక్కారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ‌చ్చారు. రాజ‌కీయ ప్ర‌సంగాలు, ఓదార్పు యాత్ర‌ల‌తో జనంలో నిలిచారు. మొద‌ట్లో వీటిని త‌క్కువ‌గా అంచ‌నా వేసిన వారు.. పెద‌వి విరిచిన వారు కూడా.. ఇప్పుడు ప్ర‌ధానంగా భావిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు భువ‌నేశ్వ‌రి మూడు రోజుల పాటు వ‌రుస‌గా నిజం గెల‌వాలి! యాత్ర చేశారు. ఈ సంద‌ర్భం గా ఆమె నిర్వ‌హించిన స‌భ‌ల‌కు భారీ ఎత్తున యువ‌త‌, మ‌హిళ‌లు కూడా త‌ర‌లి వ‌చ్చారు. తొలుత నారా భువ‌నేశ్వ‌రి.. ఓదార్పు యాత్ర‌ల ద్వారా.. చంద్ర‌బాబు అరెస్టును త‌ట్టుకోలేక మృతి చెందిన వారి కుటుం బాల‌ను పరామ‌ర్శించారు. అదేస‌మ‌యంలో వారికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇక‌, నారా భువ‌న‌మ్మ బ‌య‌ట‌కు రావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు తెర‌చాటున ఉన్న కీల‌క నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ముందుకు వ‌చ్చారు.

నారా భువనేశ్వ‌రి క‌ళ్లలో ప‌డాల‌నో.. లేక పార్టీ కార్య‌క్ర‌మాల్లో దూకుడుగా ఉన్నామ‌ని చెప్పేందుకో.. మొత్తానికి పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ ప‌రిణామంతో టీడీపీలో ఉన్న స్త‌బ్ద‌త మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. సీమ నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు. ఏదో ఒక రూపంలో పార్టీ నేత‌ల‌ను ఐక్యం చేసేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీకి బ‌ల‌మైన శ‌క్తిగా మారుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.