కేసీఆర్ ను ఓడించే మొండోడు రేవంత్: జీవన్ రెడ్డి

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలను వీడే వారు..కొత్త పార్టీలలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీకి గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్ని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందిందని చెప్పిన మోత్కుపల్లి నర్సింహులు కూడా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారు.

శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నేపథ్యంలో మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక, బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మోత్కుపల్లి పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఆ పార్టీని వీడారు. మోత్కుపల్లిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చి ఖర్గే సమక్షంలో కండువా కప్పారు.

ఇక, తాను పార్టీ మారి తప్పు చేశానని, ఆ తప్పును సరిదిద్దుకోవడానికే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే ఏకైక లక్ష్యమని, కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంతోనే పార్టీని వీడానని అన్నారు. అయితే, బీజేపీలో తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని, తన ఆశయం మాత్రం నెరవేరలేదని చెప్పారు. హంగ్ వస్తే బీజేపీ, మజ్లిస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తారని జోస్యం చెప్పారు. ప్రజలు తాను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకున్నారని, సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ ధన మదం, అధికార మదంతో మాట్లాడుతున్నారని, అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలనుకుంటున్నారని, I.N.D.I.A. కూటమికి నిధులు సమకూరుస్తానని ఆఫర్ ఇచ్చారని విమర్శించారు.

కాగా, కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే తొలి నియోజకవర్గం అదే అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ మొండోడు… ధైర్యవంతుడని, కేసీఆర్‌ను ఓడించే దమ్ము రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. రేవంత్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తర తెలంగాణవ్యాప్తంగా ఉంటుందన్నారు.