ఆరు గ్యారెంటీల భారం నీదే స్వామీ: రాహుల్, ప్రియాంక‌ల పూజ‌లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు ముందు ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. ఈ ఎన్నిక‌ల్లో వీటిని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం స‌మా ఏడాదికి 4 గ్యాస్ సిలెండ‌ర్లు ఉచితం, రూ.500 ల‌కే గ్యాస్, మ‌హిళ‌ల‌కు నెల నెలా రూ.2000 సాయం వంటి కీల‌క హామీలు ఈ ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేత‌లు ముహూర్తం పెట్టుకున్నారు.

ఇక‌, తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీలు.. తెలంగాణ‌కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్క‌డ ప‌ర్య‌టించనున్న వారు.. బ‌స్సు, బైకు యాత్ర‌లు చేప‌ట్టారు. ఇక‌, ఈ క్ర‌మంలో హ‌నుమ‌కొండలో ప‌ర్య‌టించిన రాహుల్‌, ప్రియాంక‌లు.. ఇక్క‌డి రామ‌ప్ప దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల‌కు సంబంధించిన కార్డును రామ‌ప్ప పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్‌ నేతలు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క తదితరులు రాహుల్‌ వెంట ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌ విజయభేరి యాత్రను రాహుల్‌, ప్రియాంక గాంధీ ప్రారంభించారు.