కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన యువతి ఆత్మహత్య

ఎన్నికల వేళ చోటు చేసుకునే కొన్ని పరిణామాలు అనూహ్య పరిస్థితులకు తెర తీస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది గులబీ పార్టీ. ఉరుము మెరుపుల్లేకుండా ఒక్కసారిగా పిడుగుల జడివాన పడితే ఎంతటి ఇబ్బందో అలాంటి కష్టాన్నే ఎదుర్కొనే పరిస్థితి తాజాగా ఎదురైంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న గులాబీ సర్కార్.. తాము ఇవ్వని హామీల్ని సైతం నెరవేర్చుకున్నట్లు చెప్పినా.. నిరుద్యోగం.. నిరుద్యోగ భ్రతి.. ఉద్యోగాల కల్పన విషయంలో వెనుకబడి ఉండటమే కాదు.. విమర్శలకు తావిచ్చేలా చేసిందని చెప్పాలి.

తెలంగాణ ఉద్యమం పీక్స్ కు చేరటానికి నీళ్లు.. నిధులు.. నియామకాలు అని చెప్పినప్పటినీ.. నాడు విద్యార్థులపై విరిగిన పోలీసుల ఖాకీ.. వీధుల్లోకి వారి పెద్దల్ని కూడా తీసుకొచ్చింది. ఉస్మానియా వేదికగా మొదలైన అలజడి తెలంగాణ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు మర్చిపోయినట్లుంది. తాజాగా గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని.. తాజాగా పరీక్ష వాయిదా పడటంతో మానసికంగా కుంగిన ఆమె.. ఆత్మహత్య చేసుకోవటం కలకలాన్ని రేపటమే కాదు.. ప్రభుత్వానికి కొత్త కష్టాన్ని తీసుకొచ్చింది.

ఎన్నికల వేళ.. ఏ ఇష్యూ అయితే హైలెట్ కాకూడదని భావించిందో.. ఇప్పుడు అదే ప్రధాన ఎజెండా మారేలా చేసింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రవల్లిక అనే విద్యార్థిని ఆత్మహత్య. వరంగల్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల మర్రి ప్రవల్లిక అశోక్ నగర్ లోని ఒక హాస్టల్ లో ఉంటూ గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్దమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్ లో ఎవరూ లేని వేళ.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

తోటి హాస్టల్ మేట్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని.. డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో.. అక్కడకు చేరుకున్న విద్యార్థులు.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చూస్తుండగానే పదుల సంఖ్యలో ఉన్న యువత.. నిమిషాల వ్యవధిలోనే వందల్లోకి చేరుకుంది. దాదాపు వెయ్యికు పైగా విద్యార్థులు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఆందోళన చేయటంతో.. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

అర్థరాత్రి వేళకు సైతం హాస్టల్ లోనే ప్రవల్లిక డెడ్ బాడీ ఉంది. ప్రవల్లిక కు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. ఆమె కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని.. గ్రూప్స్ అభ్యర్ధులు రోడ్ల మీదకు రావటంతో ఒక్కసారి పరిస్థితి మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉండిపోయారు. ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవటంతో.. అభ్యర్థుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేసినా.. అదేమీ ఫలించకపోగా.. మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తున్న ఈ నిరసనకు కట్టడి చేసేందుకు వీలుగా.. అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అర్థరాత్రి 1.30 గంటలు దాటిన తర్వాత ప్రవల్లిక భౌతికకాయాన్నిపోలీసుల భద్రత నడుమ అంబులెన్సులో గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఆర్ఫీఎఫ్ దళాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ యువతలో మరింత ఆగ్రహానికి గురయ్యేలా చేయటమే కాదు.. కేసీఆర్ సర్కారుకు సరికొత్త సమస్యగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.