వైసీపీ ట్రాప్‌లో టీడీపీ త‌మ్ముళ్లు?

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా లేరు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు చుట్టూనే చ‌ర్చ‌లు, రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఆయ‌న‌కు బెయిల్ ఇస్తారా? ఇవ్వ‌రా? ఈ కేసులేంటి? అనే విష‌యంపైనే టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి కీల‌క నాయ‌కుల వ‌ర‌కు కూడా అంద‌రూ ఆలోచ‌న పెట్టారు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాలు ప్ర‌స్తుతానికి సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరుకున్నాయి.

అంటే.. గ‌తంలో చంద్ర‌బాబు బ‌య‌ట ఉన్న‌ప్పుడు.. బాదుడే బాదుడు, ప్రాజెక్టుల‌పై యుద్ధం, మినీ మేని ఫెస్టోను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే కీల‌క‌మైన కార్య‌క్ర‌మాలు జోరుగా సాగాయి. ప్ర‌తి 15 రోజుల‌కు ఒక ప్రాంతంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. వైసీపీ స‌ర్కారు ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. ఇక‌, ఇత‌ర పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా ముందుండి న‌డిపించారు. మ‌రోవైపు.. నారా లోకేష్ నేతృత్వంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా ఉదృతంగానే సాగింది.

అయితే, ఉద్దేశం ఏదైనా వైసీపీ స‌ర్కారు చంద్ర‌బాబును అరెస్టు చేయించ‌డం, జైలుకు త‌ర‌లించ‌డం తెలిసిందే. దీంతో టీడీపీలో అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని కార్య‌క్ర‌మాలు గ‌త 33 రోజులుగా నిలిచిపోయా యి. ఎక్క‌డా ఒక్క నాయ‌కుడు కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు. ఎవ‌రు నోరు విప్పినా.. చంద్ర‌బాబు గురించే మాట్లాడుతూ.. ప్ర‌జా స‌మ‌స్య‌లు, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. వాస్త‌వానికి వైసీపీ నాయ‌కులు, స‌ర్కారు పెద్ద‌లు కూడా కోరుకున్న‌ది ఇదేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

బాబు అరెస్టుకు ముందు నిత్యం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై టీడీపీ నాయ‌కులు పోరు బాట ప‌ట్డడం, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించ‌డంతో స‌హ‌జంగానే స‌ర్కారు ఓటు బ్యాంకుకు పెద్ద ఇబ్బందిగానే మారింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేశార‌నే చ‌ర్చ కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. అయితే, ఈ విష‌యాన్ని గ్ర‌హించారో లేదో టీడీపీ నాయ‌కులు మాత్రం ఆ పార్టీ నిర్దేశించుకున్న కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేసి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంమానేశార‌నే చ‌ర్చ సాగుతోంది.

నిజానికి చంద్ర‌బాబు కోసం నిర‌స‌న‌లు చేయ‌డం త‌ప్పుకాక‌పోయినా.. అదేస‌మ‌యంలో పార్టీ నిర్దేశిత కార్య‌క్ర‌మాల‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వ‌డం, చంద్ర‌బాబు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను నిలిచిపోకుండా చూసుకోవ‌డం వంటివి సీనియ‌ర్ నేత‌లు ముందుండి చేయాల్సిన ప‌ని. కానీ,ఆ ప‌నిని మ‌రిచిపోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. క‌నీసం ఇప్ప‌టికైనా.. కీల‌క నాయ‌కులు.. పార్టీ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టాల‌ని అభిమానులు, కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు.