లోకేష్ విచారణ..హఠాత్తుగా అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లొకేషన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓవైపు విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మారుస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇలా, విచారణ అధికారి మార్పునకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జయరామరాజుకు పని భారం ఎక్కువగా ఉందని, ఆ కారణంతోనే దర్యాప్తు అధికారిని మారుస్తున్నామని ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. విచారణ సందర్భంగా లోకేష్ ను సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ కు, మీకు ఉన్న సంబంధం ఏమిటి అని లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై కూడా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలోనే భూముల కొనుగోలు జరిగిందని, ఎకరం ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, హెరిటేజ్ కు సంబంధించిన ఒక సమావేశానికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లోకేష్ హాజరైనట్లు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.