రూ.2వేల నోటుపై కొత్త నిజాల్ని చెప్పిన ఆర్ బీఐ

ఆర్ బీఐ తాజా నివేదికను విడుదలైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాల్ని అందులో పేర్కొంది. తరచూ అందరి నోట నానే రూ.2వేల నోటుకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. అంతేకాదు..చెలామణిలో ఉన్న నోట్లతో పాటు.. పలు అంశాల్ని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయటం ఆపేసిందని వెల్లడించింది. వాస్తవానికి ఈ అంశంపై గతంలోనూ వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అప్లై చేసిన దరఖాస్తుకు సమాధానమిస్తూ.. ఈ అంశాన్ని వెల్లడించారు.

తాజాగా అదే విషయాన్ని వెల్లడించిన ఆర్ బీఐ.. రూ.2వేల నోట్లకు సంబంధించి మరో కీలకాంశాన్ని కూడా పేర్కొన్నారు. ప్రింటింగ్ నిలిపివేయటమేకాదు.. రూ.2వేల నోట్ల చలామణిని కూడా తగ్గిస్తూ వస్తున్న వైనాన్ని పేర్కొన్నారు. 2018 మార్చి నాటికి దేశంలో 33,632 లక్షల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా.. ఈ ఏడాది మర్చి నాటికి వాటి సంఖ్య 27,398 లక్షలకు తగ్గిపోయింది.

అంతేకాదు.. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2వేల నోట్ల పరిమాణం కేవలం 3.3 శాతం మాత్రమేనని తెలిపింది. విలువ పరంగా చూసినా 2018 నాటికి మొత్తం కరెన్సీ విలువలో 37.3 శాతం ఉన్న ఈ పెద్దనోట్ల విలువ ఈ ఏడాది మార్చి నాటికి 22.6 శాతానికి తగ్గించినట్లుగా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంకు ఒక్క కొత్త రూ.2వేల నోటును ప్రింట్ చేయలేదని పేర్కొంది.

రూ.2వేల నోట్ల విషయంలో ఇలాంటి చర్యలు తీసుకున్న ఆర్ బీఐ.. అదే సమయంలో రూ.500.. రూ.200నోట్ల ముద్రణ విషయంలో మాత్రం భారీగా చేపట్టినట్లుగా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 నోట్లకు సంబంధించి 1,463 కోట్ల కొత్త నోట్లను ముద్రించాలని భావించారు. కానీ.. 1200 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్ చేశారు. అదే సమయంలో రూ.200 నోట్ల విషయానికి వస్తే 205 కోట్ల నోట్లను ముద్రించారు. వంద నోట్ల తర్వాత అత్యధికంగా రూ.50 నోట్లను ముద్రించినట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 240 కోట్ల కొత్త నోట్లను ప్రింట్ చేసి.. అందుబాటులోకి తీసుకొచ్చారు.

నకిలీ కరెన్సీ నోట్లను నిలువరించే లక్ష్యంతో వార్నిష్డ్ రూ.100 నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకున్నా.. కరోనా కారణంగా వీటిని ముద్రించలేదు. కొత్త నోట్లతో నకిలీలకు చెక్ పెట్టొచ్చని భావించినప్పటికీ.. ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదన్న విషయాన్ని ఆర్ బీఐ తన నివేదికలో చెప్పకనే చెప్పేసింది. గత ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న అన్ని విలువల కరెన్సీ నోట్లలో 2.96లక్షల నకిలీ నోట్లు చలామణిలో ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం.