కాంగ్రెస్ లో తుఫానుకు బీజం పడిందెక్కడో తెలుసా?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో ఇప్పుడు పెను తుఫానే రేగింది. ఏళ్ల తరబడి గాంధీ కుటుంబం నేతృత్వంలోనే నడుస్తున్న ఈ పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఏకంగా 23 మంది అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ లేఖపై పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తగా… దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆసక్తికరంగా చర్చించుకున్నారు. అయితే సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొత్త నాయకత్వం వైపుగా నిర్ణయమేమీ తీసుకోకున్నా… పార్టీ సారథ్య బాథ్యతలు మరింత కాలం పాటు సోనియా గాంధీనే మోయాలంటూ తీర్మానించారు. ఈ ప్రకటన వెలువడినంతనే పరిస్థితి అంతా ఓ కొలిక్కి వచ్చిందన్న వాదన వినిపించగా… అసలు అధిష్ఠానానికి 23 మంది నేతలు సంధించిన లేఖకు బీజం పడిందెక్కడన్న అంశం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీకి ఓ రకంగా అసమ్మతి దిశగానే కనిపిస్తున్న ఈ లేఖకు బీజం పడింది మాత్రం దక్షిణాది రాష్ట్రం కేరళకు చెందిన పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఇంటిలోనేనన్న విషయం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదు నెలల క్రితం థరూర్ ఇంట్లో జరిగిన విందులోనే సోనియాకు లేఖ రాయాలని సీనియర్ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన సీనియర్లలో చాలామంది ఆ లేఖపై సంతకం చేయనప్పటికీ విందుకు హాజరైన అందరూ ఆ లేఖకు గట్టి మద్దతు పలికారు. ఇక విందుకు హాజరైన వారిలో పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, సచిన్ పైలట్, అభిషేక్ మను సింఘ్వి, మణిశంకర్ అయ్యర్ తదితరులు ఉన్నారు. అయితే, వీరిలో కొందరు మాత్రం తాము పార్టీకి హాజరు కాలేదని చెబుతుండగా, సింఘ్వి మాత్రం శశిథరూర్ ఇంట్లో జరిగిన విందుకు హాజరైనట్టు తెలిపారు.

ఈ విందుకు హాజరు కావాలంటూ థరూర్ తనను ఆహ్వానించడం నిజమేనని అంగీకరించిన సింఘ్వీ… ఈ సందర్భంగా పార్టీ నూతన అధ్యక్షుడు, పార్టీలో సంస్కరణలపై అనధికారిక చర్చ జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే, లేఖకు సంబంధించిన సమాచారం మాత్రం తన వరకు రాలేదని స్పష్టం చేశారు.
సోనియాకు రాసిన లేఖపై సంతకం చేయాలని తననెవరూ అడగలేదని, తాను దానిపై సంతకం చేయలేదని మణిశంకర్ అయ్యర్ తెలిపారు. అయితే నూతన అధ్యక్షుడి ఎన్నిక, సంస్కరణలపై చర్చ జరిగిన మాట నిజమేనని ఆయన పేర్కొన్నారు. లేఖ రాసే విషయంలో విందులో పాల్గొన్న వారెవరూ వ్యతిరేకించలేదని కూడా అయ్యర్ పేర్కొనడం గమనార్హం. మొత్తంగా చూస్తే… థరూర్ ఇచ్చిన విందులోనే ఈ లేఖకు బీజం పడిందన్న మాట.