12 సీట్లు – కమ్మ సామాజిక వర్గం డిమాండ్

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 12 టికెట్లు సాధించాల్సిందే అని కమ్మ సామాజికవర్గం టార్గెట్ గా పెట్టుకున్నది. తమ సామాజిక వర్గం 40 నియోజకవర్గాల్లో బలంగా ఉందని కమ్మ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. కనీసం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములను శాసించేంత స్ధాయిలో ఉందని తెలంగాణా కమ్మ రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ గోపాలం విద్యాసాగర్ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆధ్వర్యంలో వేదికలోని ముఖ్యులు ఢిల్లీకి వెళ్ళి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు.

రాష్ట్రం మొత్తం మీద కమ్మ జనాభా సుమారు 35 లక్షలుంటుంది కాబట్టి జనాభా దామాషా ప్రకారం తమకు 12 టికెట్లు ఇవ్వాలని వేదిక డిమాండ్ చేసింది. ఖమ్మం, బాన్సువాడ, పాలేరు, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, కోదాడ, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో తమ సామాజికవర్గం చాలా ఎక్కువగా ఉన్నట్లు గోపాలం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ సామాజికవర్గానికి కేటాయించే టికెట్ల ఆధారంగా తమ సామాజికవర్గం మద్దతిచ్చే విషయం ఆధారపడి ఉందన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీఆర్ఎస్ తరపున ప్రకటించిన టికెట్లలో కమ్మ సామాజిక వర్గానికి కేసీయార్ కేవలం 5 టికెట్లు మాత్రమే కేటాయించారు. ఇపుడు కాంగ్రెస్ లో 12 టికెట్లకు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. బీజేపీ పరిస్ధితి ఏమిటో ఎవరికీ తెలీదు. మొత్తానికి సామాజిక వర్గం జనాభా, ఓటర్లను దృష్టిలో పెట్టుకుని టికెట్ల కోసం ప్రతి సామాజిక వర్గాల సంఘాల నేతలు డిమాండ్లు చేయటం ఎక్కువైపోయింది.

బీసీలు, మళ్ళీ బీసీల్లో కూడా ఉపకులాల సంఘాలు, ముస్లిం మైనారిటీ సంఘాలు ఇదే విధమైన డిమాండ్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ డిమాండ్ల ప్రకారం టికెట్లిచ్చినా ఓట్లన్నీ పడతాయనే గ్యారెంటీలేదు. కేవలం టికెట్ల సాధనకోసమే సంఘాల నేతలు పార్టీలను బెదిరిస్తుంటారు. టికెట్లు కేటాయించిన తర్వాత ఎన్నికల్లో ఏ సామాజవకవర్గం ఏ పార్టీకి ఓట్లేస్తుందో ఎవరు చెప్పలేరు. ఈ విషయాలు టికెట్లు డిమాండ్లు చేస్తున్న సంఘాలకి తెలుసు, పార్టీల అధినేతలకూ తెలుసు.