బాలయ్య ఆధ్వర్యంలో రోడ్డు షోలా ?

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తొందరలోనే తెలంగాణాలో రోడ్డు షోలు మొదలవ్వబోతున్నాయా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తేవడంలో భాగంగా పార్టీ యాక్టివిటీస్ ను పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహణతో పాటు ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం, నల్గొండ, నిజామాబాద్ లో సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అలాగే కుకట్ పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు.

ఇవన్నీ అవ్వగానే తెలంగాణ మొత్తంలో చంద్రబాబు ఆధ్వర్యంలోనే బస్సు యాత్రలు చేయాలని కూడా పార్టీ డిసైడ్ చేసింది. అయితే ఊహించని విధంగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దాంతో చంద్రబాబు షెడ్యూల్ మొత్తం తల్లకిందులైపోయింది. మరిపుడు ఏమి చేయాలి ? అన్నదే తెలంగాణా పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. అందుకనే చంద్రబాబు స్థానంలో బాలయ్యను రోడ్డుషోల్లో తిప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే బాలకృష్ణ నాయకత్వంలో పార్టీలోని నేతలంతా బస్సుయాత్రకు రెడీ అవుతున్నారట. ఇందుకు సంబంధించిన రూటుమ్యాప్ కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. మూడురోజుల క్రితమే తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర కార్యవర్గంలోని ముఖ్యనేతలతో బాలయ్య సమావేశమైన విషయం తెలిసిందే. అప్పుడే చంద్రబాబు బస్సుయాత్ర విషయాన్ని నేతలు బాలయ్య దగ్గర ప్రస్తావించారట. అప్పుడు బాలయ్య మాట్లాడుతూ బస్సు యాత్ర లో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. తొందరలోనే తెలంగాణా ఎన్నికలు రాబోతున్నాయి.

ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధం కాకపోతే చాలా ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయమని పార్టీ అభిప్రాయపడింది. అందుకనే ముందుగా బస్సుయాత్రకు రూటుమ్యాప్ ను సిద్ధం చేస్తున్నది. బస్సుయాత్రకు రెడీ అవుతారు బాగానే ఉంది కానీ మరి అభ్యర్ధుల ఎంపికను ఎవరు చూస్తారు ? వారి తరపున ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ? నిధుల పంపిణీ అన్నది కూడా చాలా కీలకమైందే. మరి వీటన్నింటికీ పార్టీ తరపున ఇప్పటికిప్పుడు సమాదానాలైతే దొరకటంలేదు. ఓ నాలుగురోజులు పోతే అన్నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.