బీఆర్ఎస్ పై బీజేపీ మైండ్ గేమ్

గడచిన వారం రోజులుగా బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. దీనికి అదనంగా నరేంద్రమోడి నిజామాబాద్ పర్యటనలో కేసీయార్ టార్గెట్ చేసిన వ్యాఖ్యలతో మైండ్ గేమ్ పరాకాష్టకు చేరుకుంది. తాజాగా కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ ఏమంటారంటే తొందరలోనే బీఆర్ఎస్ లో చీలికవస్తుందట. కేసీయార్ గడచిన 15 రోజులుగా ఎక్కడా కనిపించటంలేదని, అధికారం విషయంలో కేటీయార్-హరీష్ రావు మధ్య విభేదాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయని పదేపదే చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి కేటీయార్ ప్రయత్నిస్తుంటే అందుకు హరీష్ అడ్డుకుంటున్నారని కమలనాదులు బాగా ప్రచారం చేస్తున్నారు. అధికారం కోసం అన్నా, చెల్లెలు కేటీయార్, కవిత మధ్య కూడా విభేదాలు మొదలైనట్లు బండి చెప్పారు. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ మీద బీజేపీ మైండ్ గేమ్ అప్లై చేయాలని గట్టిగా డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. తనకెంతో సన్నిహితుడైన ఎంపీ సంతోష్ రావును కూడా కేసీయార్ దగ్గరకు రానీయటంలేదని బండి పదేపదే చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే కేసీయార్ కుటుంబంలోనే చిచ్చుపెట్టేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ వారసత్వం కోసం కేటీయార్-హరీష్ మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేటీయార్ ను పార్టీ అధ్యక్షుడిని చేద్దామని కేసీయార్ అనుకుంటే చాలామంది సీనియర్లు అడ్డుపడినట్లు ప్రచారంలో ఉంది. సీనియర్లలో అత్యధికులు హరీష్ రావుకే మద్దతుగా నిలిచారట. దాంతో ఏమిచేయాలో అర్ధంకాని కేసీయార్ కొంతకాలం వెయిట్ చేసి ఆ తర్వాత కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినట్లు పార్టీలో టాక్ ఉంది.

ట్విట్టర్లో బాగా యాక్టివ్ గా ఉండే కేటీయార్ కు బండి ట్విట్టర్ టిల్లు అని పేరుపెట్టి సెటైర్లు వేశారు. కేసీయార్ పుత్రప్రేమే పార్టీని నిండా ముంచేయబోతున్నట్లు బండి జోస్యం కూడా చెప్పారు. ట్విట్టర్ టిల్లు నాయకత్వాన్ని పార్టీలో చాలామంది సీనియర్లు అంగీకరించటంలేదు కాబట్టే తొందరలో పార్టీలో చీలిక వచ్చేస్తుందని బండి చెబుతున్నారు. ఈ భయంతోనే కేసీయార్ జాతీయరాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచనను కూడా విరమించుకున్నట్లు ఎంపీ చెబుతున్నారు. ఇవే తరహా ఆరోపణలు, జోస్యాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు.