అక్టోబర్ లో జగన్ కీలక సమావేశం

Y S Jagan

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో పార్టీ నేతలతో కీలకమైన మేథోమథనం సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకు అచ్చంగా నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ గురించి జగన్ ఆరోజు హాజరవ్వబోయే నేతలకు వివరించబోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి కాబట్టి పూర్తి సమయాన్ని అధినేతలు పార్టీ నేతలకే కేటాయిస్తారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత సమయంలో ఎక్కువ భాగం పాలనా విషయాలకే సరిపోతుంది. కాబట్టి పార్టీ కార్యక్రమాలకు కచ్చితంగా సమయం కేటాయించడం సాధ్యం కాదు. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో అధినేతలు పలనా వ్యవహారాలను తగ్గించుకుని పార్టీపై దృష్టి పెట్టడం చాలా సహజం. అధికారంలో ఎవరున్నా చేసేదిదే కాబట్టి ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీలేదు. అదే పద్ధతిలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై పార్టీ మీద దృష్టిపెడుతున్నారు.

ఇందులో భాగంగానే 9వ తేదీన విజయవాడలో పెద్ద సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో 175 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణి నేతలు ఎక్కువగా హాజరు అవబోతున్నారు. మామూలుగా పార్టీ తరపున అభ్యర్ధులు గెలవాలంటే ద్వితీయశ్రేణి నేతల మద్దతు చాలా అవసరం. అందుకనే పార్టీకోసం పనిచేస్తున్న ఇలాంటి సుమారు 4 వేలమంది నేతలను గుర్తించి సమావేశానికి హాజరవ్వాలని పిలిచారు. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని జగన్ నొక్కి చెప్పబోతున్నారు.

అలాగే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి, మంత్రులు, ఎంఎల్ఏల పనితీరు మీద కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సమాచారం. పార్టీ గెలుపుకు అందరు కష్టపడాలని, కష్టపడే నేతలకు తగిన గుర్తింపు ఉంటుందని జగన్ హామీ ఇవ్వబోతున్నారు. నియోజకవర్గ, మండల స్ధాయి నేతలతో పాటు పార్టీకి అనుబంధ శాఖల్లోని కీలక నేతలు కూడా హాజరవ్వాలని జగన్ ఆదేశించారు. మొత్తానికి ఎప్పటినుండో అనుకుంటున్న ఈ సమావేశానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఇక నుండి పార్టీకే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అంటే ముందు ముందు ఇలాంటి సమావేశాలు మరిన్ని ఉండబోతున్నాయనే అనుకోవాలి.