మ‌ళ్లీ సైలెంట్‌: జ‌న‌సేన‌లో ఊపేది బ్రో?!

అన్న అడుగేస్తే మాస్‌… అన్న స్టెప్పేస్తే మాస్‌.. అన్న మాట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బాగానే న‌ప్పుతుంది. త‌ర‌చుగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించిన స‌భ‌లు, స‌మావేశాల్లో ఏం మాట్లాడినా… నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈల‌లతో గోల పుట్టించి.. మాట్లాడే నాయ‌కుడికి కూడా గగ్గోలు పుట్టించేసి ఇంక ఆపండి చాలు! అనే రేంజ్‌లో హ‌డావుడి చేశారు. ఊపు తెచ్చారు. ప‌వ‌న్ సీఎం-ప‌వ‌నే సీఎం.. అంటూ ఊర‌మాసు డైలాగులు పేల్చారు.

అయితే.. ఇప్పుడు ఆ హ‌డావుడి మొత్తం మాయ‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. టీడీపీతో క‌లిసే వ‌చ్చే ఎన్నిక‌లకు వెళ్తామంటూ.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌… ఓ వ‌ర్గం నాయ‌కులు కొంత దీనిని సానుకూలంగా తీసుకున్నా.. మెజారిటీ యువ‌త‌లో మాత్రం సానుకూల‌త క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నా ర్హం. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ఊపు కాస్తా.. త‌గ్గిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌వ‌నేన‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

పార్టీలోనే కాదు.. బ‌య‌ట త‌న‌కు అభిమానులుగా ఉన్న వారిలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నిన్న మొన్న‌టివ‌ర‌కు ప‌వ‌న్ స‌రికొత్త ఆశ‌లు నాటారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మ‌నం ఒంట‌రిగానే వెళ్తున్నామ‌ని.. సీఎం అవ్వాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. తాను మాత్రం ముఖ్య‌మంత్రి ఎందుకు కాకూడ‌ద‌ని ఆయ‌న ప్ర‌శ్న‌లు కురిపించారు. ద‌రిమిలా.. యువ‌త ఆశ‌లు అమాంతంగా పెరిగాయి. తాము త‌ర‌చుగా చేస్తున్న ప‌వ‌న్ సీఎం అనే ప్ర‌క‌ట‌న‌, నినాదాలు కూడా నిజం కాబోతున్నాయ‌ని వారు భావించారు.

అయితే, అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఇదే యువ‌త ఇప్పుడు నైరాశ్యంలో ఉన్నారు. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు.. ఇప్పుడు ఆయ‌న సీఎం అయ్యే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. టీడీపీతో పొత్తు త‌ర్వాత‌.. రేపు ఇరు పార్టీలూ అధికారంలోకి వ‌చ్చినా.. సీఎం సీటును టీడీపీ ఎగ‌రేసుకుంటుంది. సో.. అప్పుడు జ‌న‌సేన అధినేత ఏ ప‌ద‌వితో స‌రిపుచ్చుకోవాల‌నేది ప్ర‌శ్న‌.

ఇదే యువ‌త‌ను నైరాశ్యంలో నింపేసింది. ఇదే ఊపు లేకుండా చేసింది. కాబ‌ట్టి.. త‌ర్వాత ప‌రిణామాలు, త‌న‌ను సీఎంగా కోరుకుంటున్న యువ‌త‌ను ఓదార్చ‌డం.. లేదా న‌చ్చ‌జెప్ప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు ప‌వ‌న్ తెర‌దీస్తే.. త‌ప్ప జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆయ‌న ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటారో.. లేదో చూడాలి.