బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నారా ?

తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏ నిముషంలో అయినా పార్టీలో కీలక బాధ్యతలు పోషించటానికి వీలుగా బ్రాహ్మణి అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపై బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. యువగళం పాదయాత్రను ఈరోజు నుండి పునఃప్రారంభించాలని లోకేష్ అనుకున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

పాదయాత్ర మొదలవ్వగానే లోకేష్ అరెస్టయితే బాగుండదని సీనియర్ నేతలు అనుకున్నారట. పైగా ముందస్తు బెయిల్ విచారణలో ఏమి జరుగుతుందో వెయిట్ చేయాలని లోకేష్ కు కొందరు సీనియర్లు సలహా ఇచ్చారట. దాంతో లోకేష్ మరికొద్దిరోజులు ఢిల్లీలోనే ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. దాంతో పాదయాత్ర వాయిదా పడింది. నిజానికి లోకేష్ ను సీఐడీ అరెస్టు చేయదలచుకుంటే ఢిల్లీకి వెళ్ళి అరెస్టు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి.

అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోకేష్ అరెస్టయిన వెంటనే రంగంలోకి దిగటానికి వీలుగా బ్రాహ్మణి మానసికంగా రెడీ అవుతున్నారట. లోకేష్ కు బదులుగా ఆమె పాదయాత్ర చేస్తారా లేకపోతే వాహనంలోనే పర్యటిస్తారా అన్నది ఇంకా తేలలేదు. జనాల్లోకి వెళ్ళినపుడు మాట్లాడే పద్దతి, మాట్లాడాల్సిన అంశాలను, చంద్రబాబునాయుడు పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్, ప్రభుత్వం చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల అసలు స్వరూపం లాంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటున్నారట. పనిలోపనిగా భాషపైన పట్టుండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

భువనేశ్వరి, బ్రాహ్మణిలను జనాల్లోకి వెళ్ళేట్లుగా చంద్రబాబే ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జైలులో భేటీ అయినపుడు లోకేష్ ను అరెస్టు చేస్తే జనాల్లోకి వెళ్ళటానికి రెడీగా ఉండాలని భువనేశ్వరి, బ్రాహ్మణికి చంద్రబాబే సూచించారట. వీళ్ళద్దరి జనాల్లోకి వెళితే సెంటిమెంటు పరంగా ప్రజాస్పందన సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పారట. ఎన్నికలకు ఎంతో దూరం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకున్నాకే చంద్రబాబు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. మరి వీళ్ళ ప్లాన్లు ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.