భువనేశ్వరి దిగేసినట్లేనా ?

తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నారా భువనేశ్వరి కొంగు బిగించినట్లేనా ? తాజాగా రాజమండ్రి పార్టీ నేతలతో మాట్లాడిన తీరుచూస్తుంటే అలాగే అనిపిస్తోంది. స్కిల్ స్కామ్ లో రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు మద్దతుగా భువనేశ్వరి, బ్రాహ్మణి అప్పుడప్పుడు పార్టీ నేతలతో సమావేశం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తొందరలోనే టీడీపీకి మద్దతుగా అత్తా, కోడళ్ళిద్దరు రోడ్లపైకి వస్తారని, చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం మొదలుపెడతారని పార్టీ నేతలు చెబుతున్నదే. అదేపద్దతిలో ముందు భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చేసినట్లు అర్ధమవుతున్నది.

ఇప్పటికే అన్నవరంలో మాట్లాడిన ఆమె తాజాగా రాజమండ్రిలో కూడా ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జనాలందరు చేయి చేయి కలపాలని తమకు మద్దతుగా నిలవాలని పిలుపిచ్చారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై అక్టోబర్ 3వ తేదీన సుప్రింకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అది చూసిన తర్వాత అవసరమైతే రెగ్యులర్ గా జనాల్లోనే ఉండేందుకు భువనేశ్వరి రెడీ అవుతున్నట్లే ఉంది. ఈలోగానే పార్టీ నేతలతో మీటింగులు పెట్టుకుని కార్యాచరణను రెడీ చేస్తున్నారు.

ఇదే సమయంలో బ్రాహ్మణి కూడా పార్టీ నేతలతో పాటు జనసేన నేతలతో కూడా సమావేశాలు పెట్టుకోవాలని అనుకున్నారట. యువతను ముఖ్యంగా ఐటి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల మద్దతును కూడగట్టే పనిలో ఉన్నారట. చంద్రబాబుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధానంపై చర్చలు జరుపుతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఒకవైపు మీడియా మరోవైపు సోషల్ మీడియా అలాగే జనాల్లో వెళ్ళటానికి ఏకకాలంలో పార్టీ నేతలు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

జనసేనతో సమన్వయం, సోషల్ మీడియాలో ప్రచారం బాధ్యతలను బ్రాహ్మణి తీసుకున్నారట. అలాగే పార్టీ నేతలతో కలిసి జనాల్లోకి వెళ్ళేట్లుగా భువనేశ్వరి రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. రాజమండ్రిలో మాట్లాడినపుడు కూడా ప్రజల కోసం చంద్రబాబు పడిన తపనను భువనేశ్వరి ప్రధానంగా టచ్ చేశారు. మహిళలు, యువత తమతో చేతులు కలపాలని, చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి రావాలని ఆమె పిలుపిచ్చారు. తొందరలోనే నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు పెట్టుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బహుశా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రచారంలో యాక్టివ్ పార్ట్ తీసుకునేట్లే ఉన్నారు.