బలం చాటుకుంటున్న మల్లారెడ్డి అల్లుడు

బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం దక్కిందనే సమాచారంతో రాజశేఖర్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్కాజిగిరిలో బల ప్రదర్శన నిర్వహించారు. దాదాపు వెయ్యి మందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి టికెట్ తనకు ఖాయమవడంతోనే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ బల ప్రదర్శనకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు మల్కాజిగిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ మరోసారి టికెట్ కేటాయించారు. కానీ తన కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో మైనంపల్లి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ కోసం బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటీ మొదలైంది. ఇక్కడ తన అల్లుడిని నిలబెట్టేందుకు రంగంలోకి దిగిన మల్లారెడ్డి.. ఈ మేరకు కేటీఆర్ ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ మర్రి రాజశేఖర్ రెడ్డికే కేసీఆర్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు కంటోన్మెంట్లోనూ పార్టీ ఇంఛార్జీగా ఉన్నారు. ఇప్పుడు మైనంపల్లి వెళ్లిపోవడంతో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డికి మార్గం సుగగమైంది. టికెట్ తనకే ఇస్తున్నారనే సమాచారం రావడంతో మామ మల్లారెడ్డితో కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవతున్న మైనంపల్లిని దాటుకుని అల్లుడిని గెలిపించుకోవడానికి ఇప్పటికే మల్లారెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది.