బ్రాహ్మణి చుట్టూ టీడీపీ రాజకీయం!

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, ప్రజా సంఘాల వాళ్లు కానీ, ఐటీ ఉద్యోగులు తదితరులు కానీ.. నారా బ్రాహ్మణిని కలుస్తున్నారు. ఆమెను కలిసి తమ సంఘీభావం, మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో నారా బ్రాహ్మణి చుట్టే టీడీపీ రాజకీయాలు సాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు అత్తయ్య నారా భువనేశ్వరికి ధైర్యం చెబుతూనే.. ఇటు పార్టీ విషయాల్లోనూ బ్రాహ్మణి చురుగ్గా ఉంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బాలక్రిష్ణ కూతురుగా ప్రస్థానం మొదలెట్టిన బ్రాహ్మణి.. చంద్రబాబు తనయుడు లోకేష్ ను పెళ్లి చేసుకుని నారా వారి కోడలయ్యారు. కానీ ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా.. సొంత వ్యాపారాలు చూసుకున్నారు. కానీ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మామయ్య చంద్రబాబు జైలుకు వెళ్లడంతో బ్రాహ్మణి బయటకు రాక తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బ్రాహ్మణిని ముందు నిలబెట్టి తమ కార్యకలాపాలు కొనసాగించాలని కూడా టీడీపీ అనుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టీడీపీ అధినేత బాబు జైల్లో ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీకి బ్రాహ్మణి కీలకంగా మారారనే చెప్పాలి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బ్రాహ్మణి పొలిటికల్ గా యాక్టివ్ గా మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు.. రాజమహేంద్రవరంలో బ్రాహ్మణిని కలిసి చర్చిస్తున్నారు. తాజాగా జనసేన నాయకులు కూడా ఆమెతో మాట్లాడారు. ఇక ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీతో వెళ్లి బ్రాహ్మణికి సంఘీభావం తెలిపారు. మరోవైపు ఈ కేసులో లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీలో బ్రాహ్మణి మరింత కీలకం కాబోతున్నారని టాక్.