షాక్ నుంచి కోలుకుంటూ.. యాక్షన్లోకి టీడీపీ

ఏదైనా ఊహించని పరిణామం ఎదురైతే షాక్ కు గురి కావడం సహజమే. ఇప్పుడు టీడీపీ కూడా అదే షాక్ లో ఉంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును ఎవరూ ఊహించలేదు.

రాజకీయ నాయకులపై ఆరోపణలు రావడం సహజమే.. కానీ పోలీసులు రంగంలోకి దిగి నేరుగా అదుపులోకి తీసుకునే అవకాశం లేదని టీడీపీ అనుకుంది. అరెస్టయితే చేశారు కానీ కేసు నిలబడదని కూడా టీడీపీ శ్రేణులు ఆశించాయి. కానీ టీడీపీ అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటి.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మొదటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొదట 14 రోజలు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. దీన్ని అక్టోబర్ 5 వరకు పెంచింది. మరోవైపు బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇవన్నీ ఊహించని పరిణామాలే.

దీంతో బాబు ఇంకొంత కాలం జైల్లోనే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో షాక్ నుంచి బయటకు వచ్చి యాక్షన్ ప్లాన్ పై టీడీపీ ఫోకస్ పెట్టింది. బాబు అరెస్టును జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించింది.

బాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, పార్టీ వ్యవహారల నిర్వహణ, వీటి పర్యవేక్షణ కోసం 14 మంది సభ్యులతో ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని టీడీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్, కీలక నేతలు ఉన్నారు.

చంద్రబాబు ఆదేశాల మేరకే 14 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో యనమల రామక్రిష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బాలక్రిష్ణ, లోకేష్, పయ్యావుల కేశవ్, ఎంఏ షరీఫ్, నక్కా ఆనంద్ బాబు తదితరులున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టే కార్యక్రమాలతో పాటు నేతల్ని సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ విధి. అంతే కాకుండా మద్దతుగా వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది.