బాబు లేని లోటును టీడీపీ అల‌వాటు చేసుకుంటుందిగా

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, అనంత‌రం బెయిల్ ద‌క్కే ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న‌కు షాక్ ఇస్తూ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు నిర్ణ‌యాన్ని న్యాయ‌స్థానం వెలువ‌రించింది. మ‌రోవైపు తండ్రి అరెస్టు అనంత‌రం ఆ పార్టీ యువ‌నేత లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడే వివిధ వ్య‌వహారాల్లో బిజీ ఉన్నారు. దీంతో ఇటు చంద్ర‌బాబు అటు లోకేష్ త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌లేని నేప‌థ్యంలో టీడీపీ త‌మ ఆప్ష‌న్లు వెతుక్కునే ప‌నిలో ప‌డింది.

రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మ‌రోవైపు క్వాష్ పిటిషన్‌పై ఆశించిన తీర్పు రాకపోడంతో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఇలా న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌లు ఆశ్ర‌యిస్తున్న‌ప్ప‌టికీ పార్టీ ప‌రంగా కూడా సంసిద్ధ‌తతో ఉండేలా ముందుకు సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు ప్రకటించారు. మొత్తం 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే, ఈ క‌మిటీ కూర్పులో ప‌లు కీల‌క అంశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయని అంటున్నారు. కమిటీలో చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చంద్ర‌బాబు బావ‌మ‌రిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చాన్స్ ఇచ్చారు. కమిటీలో బాలయ్యకు చోటు కల్పించడంతో ఇక నుంచి ఆయన టీడీపీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సైతం త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుండ‌టంతో బాల‌య్య‌కు నాయ‌క‌త్వ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల కోసం ఈ కూర్పు జ‌రిగింద‌ని తెలుస్తోంది.

ఇక పార్టీ సీనియ‌ర్లైన‌ యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్రయాదవ్ తో పాటు మరో 6 మందికి అవకాశం కల్పించారు. రానున్న ఎన్నికల ప్రచారంలో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. త‌ద్వారా చంద్ర‌బాబు, లోకేష్ అందుబాటులో లేక‌పోయిన‌ప్ప‌టికీ, పార్టీ కార్య‌క్ర‌మాలు కొన‌సాగేలా, శ్రేణులు నైరాశ్యం చెంద‌కుండా ఉండే విధంగా ఈ క‌మిటీ ఏర్పడింద‌ని చెప్తున్నారు.