బాబు కోసం ఊహించని మద్దతు

గ‌తంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, తెలుగు వారి అన్న‌గారు ఎన్టీఆర్ తాను నిర్వ‌హించిన స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాల‌ను ఉద్దేశించి… “నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న‌ట్టు వ‌చ్చిన నా తెలుగు ప్ర‌జ‌లు” అంటూ వ్యాఖ్యానించేవారు. అప్ప‌టి సంగ‌తి ఏమో కానీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు, జైలు అంశాల‌పై ప్ర‌జ‌ల్లో సంచ‌ల‌న క‌ద‌లిక వ‌చ్చింది. చంద్ర‌బాబు అరెస్టు, ఆయ‌న‌ను జైలుకు పంపిన విధానాన్ని నిర‌సిస్తూ.. అచ్చం నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస‌కేస్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌లు క‌ద‌లి వ‌చ్చారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ వీధుల‌న్నీ.. తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో నిండిపోయిన విష‌యం తెలిసిందే.

ఇక‌, శ‌నివారం గుంటూరు, రాజ‌మండ్రి, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, చివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప‌లు ప్రాంతాల్లో నూ చంద్ర‌బాబు అరెస్టును నిర‌సిస్తూ.. ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. విశాఖ‌లో కీల‌క టీడీపీ నాయ‌కులు,మాజీ మంత్రులు ఈ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఇక‌, రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కొవ్వొత్తుల నిర‌స‌న ర్యాలీలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి పాల్గొన్నారు. వీరి వెంట ల‌క్ష‌లాదిగా అన్ని వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు.

అదేవిదంగా క‌ర్నూలులో నిర్వ‌హించిన కొవ్వొత్తుల ర్యాలీలో కూడా భారీ ఎత్తున టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌లు పాల్గొన్నారు. ఇక‌, క‌డ‌ప‌లోని మైదుకూరు, రాజంపేట‌, రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన ర్యాలీలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో పాల్గొని చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా నినాదాల‌తో హోరెత్తించారు. ఇక‌, విజ‌య‌వాడ‌లోని ప‌లు క‌ళాశాల‌ల విద్యార్థులు కూడా తాము సైతం అంటూ.. నిర‌స‌న చేప‌ట్టారు. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు అరెస్టును నిర‌సిస్తూ..రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు క‌ద‌ల‌డం అధికార పార్టీలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు పేర్కొంటున్నారు.

ఇదిలావుంటే, అంత‌ర్జాతీయంగా కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు నానాటికీ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అమెరికాలోని డ‌ల్లాస్, సెయింట్ వేగాస్‌, బే ఏరియా స‌హా అనేక ప్రాంతాల్లో తెలుగు వారు రిలే నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తున్నారు. ఇక‌, దుబాయ్‌లోని ఎన్నారై టీడీపీ కూడా శ‌నివారం నుంచి రిలే నిరాహార దీక్ష‌లు ప్రారంభించింది. జాతీయ‌స్థాయిలోనూ త‌మిళ‌నాడు, ఒడిసా తెలుగు దేశం పార్టీ అనుబంధ విభాగాలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి.