పోరాటం కిష‌న్ రెడ్డిది.. మైలేజీ బండి సంజ‌య్‌ది

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రప‌డ‌ట‌మే కాకుండా బీజేపీ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రోమారు త‌న ముద్ర వేసుకున్నారు. బీజేపీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కారు దగా చేస్తోందంటూ చేప‌ట్టిన 24 గంటల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఈ సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో బీఆర్ఎస్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దీక్ష చేసిన కిష‌న్ రెడ్డి కంటే బండి సంజ‌య్‌కే ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఉన్నాయ‌ని అంటున్నారు.

“నిన్న న్యూజెర్సీ నుండి వచ్చిన.. అక్కడ యువకులు రెస్టారెంట్లో మాస్క్ వేసుకుని హోటల్ లో సర్వర్ పనులు చేసుకుంటున్నరు. వాళ్లంతా తెలంగాణ వాళ్లే. తెలంగాణలో ఉద్యోగాల్లేక ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నమని, తల్లిదండ్రులు బాధ పడతారని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నామని చెబితే బాధేసింది.” అంటూ త‌న అమెరికా టూర్‌కు, తెలంగాణ యువ‌త‌కు ముడిపెట్టి బండి సంజ‌య్ ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చి మాట్లాడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీక్ష‌లోని వారంద‌రినీ క‌నెక్ట్ చేసుకున్నారు.

కేసీఆర్ చేతగానితనంవల్లే తెలంగాణ నిరుద్యోగులంతా దుబాయ్, మస్కట్ పోయి కూలీ పనులు చేసుకుంటూ నానా కష్టాలు పడుతున్నారని బండి సంజ‌య్ మండిప‌డ్డారు. “తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని ప్రవాస తెలంగాణ వాసులంతా కేసీఆర్ కు డబ్బులిచ్చి ఉద్యమంలో సాయపడితే… రాష్ట్రం వచ్చాక కూడా వాళ్ల బతుకులు మారలేదని, స్వదేశానికి వచ్చి బతికే పరిస్థితి లేదని బాధపడుతున్నరు. కేసీఆర్ మళ్లీ నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి… ఉద్యోగాల ప్రకటన పేరుతో మళ్లీ అదికారంలోకి రావాలని చూస్తున్నడు… ప్రజలు నిరుద్యోగుల మాటలను నమ్మొద్దు.. పరీక్షలు నిర్వహించలేని, నోటిఫికేషన్లు వేయలేని, మహిళలను, నిరుద్యోగులను, రైతులను ఆదుకోని కేసీఆర్ ఎట్లా అధికారంలోకి వస్తుందో చెప్పాలి? ” అని సంజ‌య్ పేర్కొన్నారు. నిరుద్యోగుల గోస తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే అని పేర్కొన్నారు.

తొలిదశ, మలిదశ తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చినా…. నేటికీ యువతకు ఉద్యోగాలివ్వలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నార‌ని బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇచ్చేందుకు డబ్బుల్లేక ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగుల పొట్టకొట్టిండు… అంటూ విరుచుకుప‌డ్డారు. కాగా, 24 గంట‌ల దీక్ష చేసిన కిష‌న్ రెడ్డి కంటే, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో వ‌చ్చి ప్ర‌సంగించిన బండి సంజ‌య్ కే ఎక్కువ మైలేజీ వ‌చ్చేలా దీక్ష సంద‌ర్భంగా ప‌రిస్థితులు క‌న్పించాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.