చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో పెట్టుకొని హౌస్ అరెస్ట్ కు అనుమతినివ్వాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా…ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఆ హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆ అంశంపై వాదోపవాదాలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమ బిందు ఆ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేశారు. అయితే, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కావడం, జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నేత కావడంతో జైలులో ప్రత్యేక గది, వసతి కల్పించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు, చంద్రబాబుకు అవసరమైన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది.

మరోవైపు, చంద్రబాబును వారం రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.ఆ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశముంది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రేపు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు పోలీసులు 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.