బీజేపీతో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని, విభజన గాయాల కంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన గాయమే ఎక్కువ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ విధానాల వల్లే తెలంగాణకు, ఆంధ్రకు అభివృద్ధిలో పొంతన లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తాను గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదని, ఆ పార్టీ టిడిపిగా మారిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక, బీజేపీతో పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బిజెపితో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నాం అనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. తాను చూడని రాజకీయం లేదని, దేశ నిర్మాణంలో భాగం కావడమే తన ఉద్దేశమని అన్నారు. అది ఏ విధంగా, ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక, తెలంగాణలో బీజేపీతో పొత్తులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు సమయం మించిపోయిందని, తెలంగాణలో టిడిపి ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో తాను విభేదించానని మిగతా విషయాలలో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని క్లారిటీని ఇచ్చారు ఇదే విషయాన్ని తన గతంలో చాలా సార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు.టిడిపి జాతీయభావంతో ఉండే పార్టీ అని, జాతీయ రాజకీయాలతో టీడీపీకి ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధం ఉంటుందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేశామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏడుగురు సభ్యులతో చంద్రబాబు కమిటీని నియమించిన సంగతి తెలిసింది. ఏపీని ఎలా పునర్మించాలి అనే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు అన్నారు.