ఇండియాకు షాకిచ్చిన కేజ్రీవాల్

కొత్తగా ఏర్పడిన ఇండియాకూటమికి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పెద్ద షాకిచ్చారు. బీహార్లో తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుందని ప్రకటించారు. స్ధానిక సంస్ధల ఎన్నికలతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న కేజ్రీవాల్ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటన ఇండియా కూటమిలో కలకలం రేపుతోంది. కూటమి స్పూర్తిని  కేజ్రీవాల్ దెబ్బతీస్తారా అంటు విమర్శలు మొదలయ్యాయి.

అయితే పార్లమెంటు ఎన్నికల్లో  ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లోను పోటీచేస్తుందని  కాంగ్రెస్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ప్రకటనకు విరుగుడుగానే కేజ్రీవాల్ తాజా ప్రకటన ఉందనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. నిజంగానే ఇండియాకూటమి పటిష్టంగా ఉండాలని అనుకుంటే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసేదే కాదు. ఢిల్లీలోని ఏడుస్ధానాలను తమకే వదిలేయమని కేజ్రీవాల్ అన్నపుడు పొత్తులో రెండో లేకపోతే మూడు స్ధానాలో తీసుకునే ప్రయత్నంచేయవచ్చు.

కానీ రెండుపార్టీల మధ్య ఆ దిశగా చర్చలు జరగలేదు. అందుకనే రెండుపార్టీలు పంతాలకు పోయి తమిష్టం వచ్చిన ప్రకటనలు చేస్తున్నాయి. ఇది అంతిమంగా కూటమి ఐక్యతమీద దెబ్బ పడబోతోంది. కూటమి పటిష్టంగా ఉండాలంటే పార్టీలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నది వాస్తవం. త్యాగాలకు రెడీగా ఉన్నపుడే కూటమి బలోపేతమవుతుంది. అలాకాకుండా బలాబలాలు తేల్చుకుందామని అనుకుంటే ఇక కూటమి అవసరమేలేదు. కూటమిలోని పార్టీలు దేని బలం అది తేల్చుకుంటే అందరినీ కలిపి నరేంద్రమోడి చావగొట్టడం ఖాయం.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే భాగస్వామ్యపార్టీలు  చర్చలు జరపాలి. నిజాయితీగా, చిత్తశుద్దితో పొత్తులు మాట్లాడుకుంటే ఎన్డీయే బలాన్ని తగ్గించే అవకావాలున్నాయి. అలాకాకుండా తమకు బలముంది అనుకుంటన్న రాష్ట్రాల్లో, నియోజకవర్గాల్లో  తామే పోటీచేస్తామని పట్టుదలకు పోతే అంతిమంగా అందరు నష్టపోవటం ఖాయమని అర్ధంచేసుకోవాలి. ఇలాంటి అవకాశాల కోసమే నరేంద్రమోడీ వెయిట్ చేస్తున్నారు. బహుశా కూటమి భాగస్వామ్యపార్టీల్లో ఎవరైనా మోడీకి కోవర్టుగా కూడా పనిచేస్తుండే అవకాశాలున్నాయి. కాబట్టి అందరు కలిసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరి లేకపోతే 2019 ఫలితమే రిపీట్ అవటం ఖాయం.