కేసీయార్ పెద్ద ప్లాన్లో ఉన్నారా?

రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే తన పరిస్ధితి ఏమిటో కేసీయార్ కు బాగా తెలుసు. హ్యాట్రిక్ విజయం సాధిస్తేనే కేసీయార్ కు జాతీయరాజకీయాల్లో కనీసం గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఎలాంటి గుర్తింపు లేకుండా ఉనికికోసమే పాకులాడాల్సుంటంది. అధికారంలో ఉన్నపుడే ఇపుడు జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కు గుర్తింపులేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే అసలు దేకే వాళ్ళే ఉండరన్నది వాస్తవం. అందుకనే గెలుపుకోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే శ్రావణమాసంలో కొన్ని సామాజికవర్గాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని అనుకున్నారట. కమ్మ, రెడ్డి, బీసీ, మైనారిటి సామాజికవర్గాల్లోని ముఖ్యులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కమ్మ సామాజికవర్గం ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీళ్ళల్లో ముఖ్యులు బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నట్లు నివేదికలు అందాయట. కమ్మ సామాజికవర్గం మెల్లిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతోందని సమాచారం. టీడీపీ ఎలాగు లేదు కాబట్టి, బీఆర్ఎస్ ఏమిటో చూశాం కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలని అనుకుంటున్నారట.

ఇక రెడ్డి సామాజికవర్గంలో మెజారిటి నేతలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాకపోతే రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గారు. అయితే బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఉపయోగాలు ఉండవన్న విషయం నిర్ధారణైందట. అందుకనే మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు పెరుగుతోందని సమాచారం.  ఇక బీసీలంటారా సమాజంలో సగం జనాభా వాళ్ళదే కాబట్టి బీసీ సామాజికవర్గాలను తనవైపే ఉండేట్లుగా కేసీయార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు టాక్. తన పాలనలో బీసీల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే రిపోర్టులు అందాయట.

ఇక మైనారిటిల సామాజికవర్గం కూడా తక్కువేమీ లేదు. మైనారిటీల్లో క్రిస్తియన్లు, జైనులు, సిక్కులు, బౌద్ధలకన్నా ముస్లింల జనాభా చాలా ఎక్కువ. కనీసం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములను ముస్లింలే డిసైడ్ చేయగలరట. అందుకనే వీళ్ళ ఓట్లపైన కేసీయార్ బాగా దృష్టిపెట్టారు. అయితే అనేక కారణాల వల్ల మైనారిటిల్లో కేసీయార్ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, సంక్షేమపథకాలు సక్రమంగా అమలు కాకపోవటం లాంటి అనేక కారణాలతో ముస్లింల్లో వ్యతిరేకత పెరుగుతోందట. అందుకనే పై వర్గాలను మంచి చేసుకునేందుకే ప్రత్యేకంగా కుల సమ్మేళనాలకు తెరలేపబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.