రాహుల్ పేరు చెప్పి.. సంజ‌య్‌ను ఇరికించాల‌ని..

మోదీ ఇంటి పేరును అవ‌మానించేలా మాట్లాడార‌ని రాహుల్ గాంధీపై సూర‌త్ కోర్టు శిక్ష విధించ‌డం, వెంట‌నే లోక‌స‌భ స‌భ్యుడిగా స‌స్పెన్ష‌న్ వేయ‌డం తెలిసిందే. కానీ ఆ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వ‌డంతో రాహుల్ లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని తిరిగి పున‌రుద్ధ‌రించ‌డంతో ఆయ‌న స‌భ‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇదంతా తెలిసిందే క‌దా కొత్తేముందీ అనుకుంటున్నారా? ఇప్పుడు రాహుల్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌ను ఇరికించాల‌ని కేటీఆర్ ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలిసింది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఖాసిం చంద్ర‌శేఖ‌ర్ రిజ్వీ అని లోక్‌స‌భ‌లో బండి సంజ‌య్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌ను క‌ల్వ‌కుంట్ల కుటుంబం దోచుకుంటుంద‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే భ్ర‌ష్టాచ‌ర్ రాక్ష‌స స‌మితి అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ రైతుల ఆదాయం పెర‌గ‌లేదు కానీ, సీఎం కుటుంబ ఆదాయం మాత్రం పెరిగింద‌ని ఆరోపించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు, సీఎం భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయ‌ని బండి సంజ‌య్ తెలిపారు.

సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప‌రోక్షంగా రాహుల్ గాంధీని వాడుకుంటూ సంజయ్‌పై చ‌ర్య‌లు తీసుకోరా? అని లోక్‌స‌భ స్పీక‌ర్‌ను ప్ర‌శ్నించారు. ”ప్ర‌ధాని ఇంటి పేరును అవ‌మానించారంటూ ఓ కాంగ్రెస్ ఎంపీపై అన‌ర్హ‌త వేటు వేశారు. ఇప్పుడు లోక్‌స‌భ‌లో తెలంగాణ‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ.. తెలంగాణ‌లో రెండు సార్లు ఎన్నికైన ప్ర‌జాద‌ర‌ణ పొందిన సీఎం కేసీఆర్‌ను అత్యంత నీచ‌మైన భాష‌లో కించ‌ప‌రిచారు. మీరు/మేము ఇప్పుడు ఏం చేయాలి స్పీక‌ర్ సార్‌? ” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో సంజ‌య్‌ను భ‌లే ఇరికించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.