ఇండియా కూటమి సక్సెస్ అయ్యిందా ?

మణిపూర్లో అల్లర్ల విషయమై కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టడం, దోషిగా నిలబెట్టడంలో ఇండియాకూటమి సక్సెస్ అయినట్లేనా ? పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే  అయ్యిందనే అనుకోవాలి. ఎందుకంటే మొదటిరోజు అంటే 8వ తేదీన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కేంద్రప్రభుత్వం ఇబ్బందులు పడింది. అలాగే రెండోరోజు అంటే 9వ తేదీన రాహుల్ గాంధి ప్రసంగమైతే సభలో మంటలు పుట్టించాయి. మణిపూర్లో అల్లర్లకు కేంద్రానిదే బాధ్యతంటు రాహుల్ పదేపదే ప్రస్తావించారు.

రాహూల్ ప్రశ్నలకు, చేసిన విమర్శలు, ఆరోపణలకు హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పినా వాస్తవ దూరంగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. రాహుల్ ప్రధానంగా మూడు ప్రశ్నలు వేశారు. అవేమిటంటే అల్లర్లను కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రిని ఎందుకు మార్చలేదు ? ప్రధానమంత్రి ఎందుకు మణిపూర్లో పర్యటించలేదు ? పార్లమెంటులో ఎందుకు దీర్ఘకాలిక చర్చకు అనుమతించలేదని అడిగారు. అందుకు అమిత్ షా సమాధానమిస్తు ముఖ్యమంత్రి కేంద్రానికి సహకరిస్తున్నారు కాబట్టి మార్చాల్సిన అవసరంలేదన్నారు.

అలాగే మోడీ ఎందుకు పర్యటించలేదన్న ప్రశ్నకు తాను మూడురోజులు క్యాంపు వేశానని, కొందర మంత్రులు రెగ్యులర్ గా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాగే మణిపూర్ అల్లర్లపై సభలో చర్చకు అనుమతించినట్లు సమర్ధించుకున్నారు. ముఖ్యమంత్రి కేంద్రానికి సహకరిస్తున్నారా లేదా అన్నది ముఖ్యంకాదు. రాష్ట్రంలో అల్లర్లను కంట్రోల్ చేశారా లేదా అన్నదే కీలకం. అందులో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఫెయిలయ్యారు. నరేంద్రమోడీ మణిపూర్లో పర్యటించలేదు. అల్లర్ల సమయంలో కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు.

ఇక పార్లమెంటులో చర్చ విషయంలో అమిత్ చెప్పింది అబద్ధం. అల్లర్లపై దీర్ఘకాలిక చర్చకు ఇండియాకూటమి, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే దీర్ఘకాలిక చర్చ అవసరంలేదని, స్వల్పకాలిక చర్చ చాలని ప్రభుత్వం తేల్చేసింది. దాంతో లాభంలేదనే ఇండియాకూటమి ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకపోయుంటే ఇపుడు కూడా పార్లమెంటులో మణిపూర్ అల్లర్లపై చర్చలు జరిగేదే కాదు. దీంతోనే ప్రభుత్వం పార్లమెంటులో ఎంత డిఫెన్సులో పడిపోయిందో అర్ధమైపోతోంది. ఇండియాకూటమి కోణంలో చూస్తే పర్పస్ సర్వ్ అయినట్లే అనిపిస్తోంది.